లుంగీ పైకి కట్టుకున్నాడని..

31 Oct, 2015 13:32 IST|Sakshi
లుంగీ పైకి కట్టుకున్నాడని..

చెన్నై: లుంగీని మోకాళ్లపైకి కట్టుకున్నందుకు ఓ దళిత యువకుడిని చితక్కొట్టిన వైనం తమిళనాడులో శుక్రవారం చోటుచేసుకుంది. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా తూతుకుడిలో ఈ దారుణం జరిగింది. మునియంది(21)  అనే దళిత యువకుడిపై  ఐదుగురు వ్యక్తులు దాడిచేసి, తీవ్రంగా గాయపర్చారు.

దసరా పండుగ సందర్బంగా కులశేఖర పట్టినం బీచ్‌కు వచ్చిన మునియంది.. తన లుంగీని పైకి కట్టుకున్నాడు. అయితే కిందకు వేసుకోలేదంటూ కొంతమంది వ్యక్తులు అతడితో గొడవకు దిగారు.  మా ముందే  లుంగీ పైకి  కట్టుకుని వెళ్తావా అంటూ  ఐదుగురు వ్యక్తులు ఆవేశంతో ఊగిపోయారు. అందరూ కలిసి అతడిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి పీవీపీ  పైపులతో దారుణంగా కొట్టారు. అంతటితో వారి ఆగ్రహం చల్లారలేదు. గ్రామంలో దళితులెవ్వరూ లుంగీ పైకి కట్టుకోవడానికి వీల్లేదంటూ హుకుం జారీచేశారు. దళితులు లుంగీ పైకి కట్టుకుని తమ వీధుల్లో నడిస్తే తమ మర్యాదకు భంగమంటూ, ఇంకోసారి ఇలాసారి  జరిగితే  సహించేది లేదని బెదిరించారు. బాధితుడు ప్రస్తుతం తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

గ్రామంలోని దళితులు ఈ  ఉదంతంపై ఆగ్రహం వ్యక్తం  చేశారు. తమకు న్యాయం చేయాలని  కోరుతూ  పోలీసులను ఆశ్రయించారు. వీరి ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు దురై, ఆనంద్, చెల్లా, సమ్ముకుట్టి, ఇసాయికుదుకురై తదితరులపై కేసులు నమోదు చేశారు.

>
మరిన్ని వార్తలు