కేజ్రీవాల్‌ కాన్వాయ్‌పై కర్రలతో దాడి

8 Feb, 2019 19:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కాన్వాయ్‌పై శుక్రవారం మధ్యాహ్నం కొందరు దుండగులు కర్రలు చేబూని దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు ఇంకా వెల్లడి కాలేదని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ఒకరు వెల్లడించారు. ఉత్తర ఢిల్లీలో 25 అనధికార కాలనీల్లో అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు సీఎం వెళుతుండగా నరేలా ప్రాంతంలో దాడి జరిగినట్టు సమాచారం. కేజ్రీవాల్‌ కారును ఆపేందుకు దాదాపు వంద మంది కర్రలతో ఆయన కారుపై దాడి చేసేందుకు ప్రయత్నించారు.

సీఎం కారు అద్దాలు పగులగొట్టేందుకూ వీరు ప్రయత్నించారు. కాగా గతంలోనూ కేజ్రీవాల్‌పై దుండగులు దాడికి యత్నించారు. గత ఏడాది నవంబర్‌లో ఢిల్లీ సెక్రటేరియట్‌లో సీఎం కార్యాలయం వెలుపల ఓ వ్యక్తి కేజ్రీవాల్‌పై కారం చల్లారు. 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా దక్షిణ ఢిల్లీలో జరిగిన రోడ్‌షోలో ఓ వ్యక్తి కేజ్రీవాల్‌ చెంప చెళ్లుమనిపించారు. అంతకుముందు హర్యానాలో ఓ రోడ్‌షోలోనూ కేజ్రీవాల్‌పై దాడిచేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించడం కలకలం రేపిం‍ది.

మరిన్ని వార్తలు