సమ్మెలో పాల్గొంటే..!

7 Jan, 2020 16:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అఖిల భారత సమ్మెలో పాల్గొంటే చర్యలు తప్పవని ప్రభుత్వ ఉద్యోగులను కేంద్రం హెచ్చరించింది. ఏ రూపంలోనైనా సమ్మెలో పాల్గొంటే ఏ ఉద్యోగి అయినా తగిన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని తెలిపింది. ఇది వేతనాల తగ్గింపుతో పాటు తగిన క్రమశిక్షణా చర్యలను కూడా వుంటాయని ఉత్తర్వులో పేర్కొంది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు నిషేధాజ్ఞలు జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ ఉద్యోగులను సమ్మెకు వెళ్ళేలా చట్టబద్ధమైన నిబంధనలు లేవని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ప్రతిపాదిత సమ్మె సమయంలో అధికారులు, ఉద్యోగులకు సాధారణం సెలవు లేదా మరే ఇతర సెలవులను మంజూరు చేయొద్దని అధికారులకు సూచించింది. అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్)ను ఆదేశించింది.  

కార్మిక సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ)  ప్రైవేటీకరణ తదితర  కేంద్ర ప్రభుత్వ  ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారతీయ మజ్దూర్ సంఘ్ మినహా సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు, వ్యవసాయ రైతు సంఘాల ఐక్యవేదిక సహా వివిధ సంఘాలు రేపు (జనవరి 8) సమ్మె చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మెలో ఆరు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు కూడా పాల్గొంటున్నాయి. కనీస వేతనం, సామాజిక భద్రత తదితర 12 పాయింట్ల సాధారణ డిమాండ్లతో ఈ సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. దాదాపు 25 కోట్లమందికి తగ్గకుండా  ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటారని పోరాట సంఘాలు అంచనా వేస్తున్నాయి. 

భారత్ బంద్‌నకు పిలుపునిచ్చిన ప్రధాన కార్మిక సంఘాలు:
ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఐఎన్‌టీయూసీ)
ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్  (ఏఐఎటీయూసీ)
హింద్ మజ్దూర్ సభ (హెచ్‌ఎంఎస్)
సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటియు)
ఆల్ ఇండియా యునైటెడ్ ట్రేడ్ యూనియన్ సెంటర్  (ఏఐయూటీయూసీ)
ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ సెంటర్ (టియుసిసి)
స్వయం ఉపాధి మహిళల సంఘం (సెవా)
ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (ఏఐసీసీటీయూ) 
లేబర్ ప్రోగ్రెసివ్ ఫెడరేషన్ (ఎల్‌పీఎఫ్‌)
యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (యుటియుసి)

చదవండి : ఆ సమ్మెలో 25 కోట్ల మంది
జనవరి 8 సమ్మెలో ఆరు బ్యాంకు సంఘాలు

మరిన్ని వార్తలు