చితిపేర్చుకొని నిప్పంటించుకున్నాడు!

2 Dec, 2014 04:15 IST|Sakshi
కాశీరాం భగవాన్ ఇందారె ఫైల్ ఫొటో

 నాగపూర్:  దేశంలో రైతు వెతలను కళ్లకు గట్టే ఘటన మహారాష్ట్రలో శుక్రవారం జరిగింది.  వ్యవసాయం ప్రాణాంతకంగా మారిన పరిస్థితికి నిలువుటద్దం లాంటి ఘోరం. దేశానికి వెన్నుముకలాంటి రైతన్న బతికుండగానే సొంత చితికి తానే నిప్పు పెట్టుకున్న దారుణం ఘటన ఇది.  రైతు ఆత్మహత్యలకు ప్రసిద్ధి గాంచిన విదర్భ ప్రాంతంలోని అకోలా జిల్లాలో ఉన్న మానర్ఖేడ్ గ్రామంలో కాశీరాం భగవాన్ ఇందారె అనే రైతుకు  75 ఏళ్లు. తనకున్న ఎకరం భూమిలో ఈ ఏడు పత్తి, సోయాబీన్ వేశాడు. అనావృష్టి, కరవు ఆ పంటలను దెబ్బతీశాయి. భగవాన్ తట్టుకోలేకపోయాడు. బాధను, నిస్సృహను భార్యతో పలుమార్లు పంచుకున్నాడు. సొంత పొలంలోనే స్వయంగా చితిని నిర్మించుకున్నాడు. తానే నిప్పంటించుకుని తనువు చాలించాడు.  శుక్రవారం ఈ ఘటన జరిగింది. భగవాన్ రాత్రి ఇంటికి రాకపోవడంతో వెతుక్కుంటూ వెళ్లిన కుటుంబ సభ్యులకు కాలిన స్థితిలో ఆయన మృతదేహం కనిపించింది.

పోలీసులు ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. గత 50 రోజుల్లో విదర్భ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్న 42వ రైతు కాశీరాం భగవాన్.

 విదర్భ ప్రాంతంలోని కరవు పీడిత ఆరు జిల్లాల్లో గత పదేళ్లలో దాదాపు 10 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఒక్క నవంబర్ నెలలోనే విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో దాదాపు 120 మంది రైతులు చనిపోయారని విదర్భ జన ఆందోళన సమితి అధ్యక్షుడు కిశోర్ తివారీ సోమవారం తెలిపారు. గత 24 గంటల్లోనే దాదాపు పాతిక మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. సగటున రోజుకు నలుగురు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి, సోయాబీన్ రైతులే ఎక్కువగా ఈ దారుణానికి ఒడిగడుతున్నారన్నారు. కరవు కారణంగా దాదాపు 50 లక్షల హెక్టార్ల పంట నాశనమైందని చెప్పారు. రూ. 60 వేల కోట్లు అవసరముండగా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కేవలం రూ. 4 వేల కోట్లు కేంద్రసాయాన్ని కోరడాన్ని తివారీ తప్పుబట్టారు.
**

మరిన్ని వార్తలు