మొహర్రం వేడుకల్లో పాక్ నినాదాలు

3 Oct, 2017 13:53 IST|Sakshi

21 మంది ఎఫ్‌ఐఆర్‌ నమోదు

బిహార్‌లో ఘటన

పాట్నా : మొహర్రం పర్వదినం సందర్భంగా బిహార్‌లోని బెట్టయ్య ప్రాంతంలో పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన 21 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నిందితులు పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు ధరించే దుస్తులు వేసుకుని, చేతిలో లాఠీలు ఇతర ఆయుధాలు పట్టుకుని ఈ నినాదాలు చేశారని అధికారులు చెబుతున్నారు. మొహర్రం-దుర్గా పూజల సందర్భంగా మత ఘర్షణలకు తావిచ్చేలా నినాదాలు చేశారని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచామని పోలీసులు ప్రకటించారు.

పాకిస్తాన్‌ క్రికెట్‌ దుస్తులు ధరించిన యువకుల ఇళ్లల్లో సోదాలు జరిపినట్లు పోలీస్‌ అధికారి వివేక్‌ కుమార్‌ జైస్వాల్‌ తెలిపారు. సోదాల్లో పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు ధరించే టీ షర్టులు, వివాదాస్పద పుస్తకాలు, మరికొన్నింటిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదైన 21 మంది ప్రస్తుతం పరారీలో ఉన్నారని జైస్వాల్‌ తెలిపారు. పరారీలో ఉన్న వారిలో కొందరిని గుర్తించామని చెప్పారు.

పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసినవారిలో నజీర్‌, ఆఫ్తాబ్‌, సర్ఫరాజ్‌, సల్మాన్‌, అజార్‌, గుహార్‌, అజుఖ్‌, ఇమ్రాన్‌, సలావుద్దీన్‌, నసీరుద్దీన్‌ తదితరులు ఉన్నట్లు చంపారన్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ వినయ్‌ కుమార్‌ చెప్పారు. నిందితులను వీలైనంత తొందరగా అదుపులోకి తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు