నిత్యానందపై కేసు నమోదు

21 Nov, 2019 19:45 IST|Sakshi

అహ్మదాబాద్‌ : వివాదాస్పద ఆథ్యాత్మికవేత్త స్వామి నిత్యానందపై గుజరాత్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అహ్మదాబాద్‌లోని తమ ఆశ్రమంలో​ నలుగురు చిన్నారులను విరాళాల సేకరణకు ఉపయోగించుకుంటూ ఆశ్రమంలో దిగ్బంధించారనే ఆరోపణలపై నిత్యానందపై కేసు నమోదు చేశారు. మరోవైపు నిత్యానంద శిష్యులు సాధ్వి ప్రణ్‌ప్రియానంద, సాధ్వి ప్రియతత్వ రిధి కిరణ్‌లను చిన్నారులను కిడ్నాప్‌ చేసి, బాల కార్మికులుగా వారితో పనిచేయిస్తున్నారనే ఆరోపణలపై అరెస్ట్‌ చేశారు. నలుగురు చిన్నారులను ఆశ్రమంలోని ఫ్లాట్‌ నుంచి రక్షించిన పోలీసులు వారి స్టేట్‌మెంట్‌ ఆధారంగా నిత్యానందపై కేసు నమోదు చేశారు.

ఈ ఆశ్రమాన్ని నిత్యానంద తరపున సాధ్వి ప్రణ్‌ప్రియానంద, సాధ్వి ప్రియతత్వ రిధి కిరణ్‌లు నిర్వహిస్తున్నారని, చిన్నారులను అక్రమంగా నిర్బంధించి వారిచే ఆశ్రమాన్ని నడిపేందుకు విరాళాలను వసూలు చేయిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. చిన్నారుల తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులకు ఆశ్రమంలో సాగుతున్న వ్యవహారం రట్టయింది. మరోవైపు ఆశ్రమంలో నిర్బంధించిన తమ కుమార్తెలను విడిపించాలని జనార్ధనశర్మ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెలను కలిసేందుకు ఆశ్రమ నిర్వాహకులు అనుమతించడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు నకిలీ పాస్‌పోర్ట్‌పై నిత్యానంద నేపాల్‌లో తలదాచుకున్నాడు.

మరిన్ని వార్తలు