తుంటరి బకరాకు బెయిల్

10 Feb, 2016 15:33 IST|Sakshi
తుంటరి బకరాకు బెయిల్

రాయ్‌పూర్: ఛత్తీస్గఢ్‌లో ఓ కలెక్టర్ గారి తోటలో  ప్రవేశించి గలాటా చేసిన మేకకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. కలెక్టర్ హేమంత్ రాత్రే తోటలోకి చొరబడిన కేసులో సోమవారం అరెస్టయిన ఈ బకరాకు.. స్థానిక కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం నాడు ఆ తుంటరి మేకపిల్లను కోర్టు ముందు హాజరు పరిచారు. మేకతో పాటు స్టేషన్‌లో ఊచలు లెక్కపెడుతున్న యజమాని అబ్దుల్ కూడా కోర్టు తుది నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాడు.

తాము నమోదుచేసిన సెక్షన్ల ప్రకారం రెండు నుంచి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉందని  ఎస్సై ఆర్.పి.శ్రీవాస్తవ తెలిపారు. రాజధాని రాయ్‌పూర్ నుంచి 350 కిలోమీటర్ల దూరంలో నివసించే అబ్దుల్ హసన్‌కు చెందిన మేక జిల్లా కలెక్టర్ హేమంత్ రాత్రే తోటలో పూలను, కూరగాయలను నాశనం చేసింది. దీనిపై తోటమాలి పలుమార్లు అబ్దుల్ని హెచ్చరించాడు. అయినా గత సోమవారం తోటలోకి చొరబడిన మేక నానా బీభత్సం సృష్టించడంతో తోటమాలి ఫిర్యాదు చేయడం,  పోలీసులు సదరు మేకను అదుపులోకి తీసుకోవడం తెలిసిందే.

మరిన్ని వార్తలు