ఓఎన్‌జీసీ చేతికి హెచ్‌పీసీఎల్‌

21 Jan, 2018 04:13 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు రిఫైనింగ్‌ సంస్థ హెచ్‌పీసీఎల్‌లో ప్రభుత్వ వాటాలను ఓఎన్‌జీసీ కొనుగోలు చేయనుంది. ‘రూ.36,915 కోట్లకు హెచ్‌పీసీఎల్‌లో 51.11 శాతం వాటాల వ్యూహాత్మక విక్రయానికి సంబంధించి శనివారం ఓఎన్‌జీసీతో కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది’ అని కేంద్ర ఆర్థిక శాఖ ట్విటర్‌లో పేర్కొంది.

పూర్తి నగదు చెల్లింపుల రూపంలో ఉండే ఈ ఒప్పందం జనవరి చివరి వారం కల్లా పూర్తి కానుంది. ఓఎన్‌జీసీ వద్ద ఇప్పటికే రూ.12,000 కోట్ల నగదు నిల్వలుండగా, మిగిలిన మొత్తాన్ని  రుణం రూపంలో సమీకరించనుంది. ఈ కొనుగోలుతో ఇటు చమురు ఉత్పత్తి నుంచి రిటైల్‌ విక్రయాల దాకా అన్ని విభాగాల్లోనూ కార్యకలాపాలున్న దిగ్గజంగా ఓఎన్‌జీసీ అవతరించనుంది. హెచ్‌పీసీఎల్‌ దేశీయంగా మూడో అతి పెద్ద చమురు రిఫైనింగ్, ఇంధన మార్కెటింగ్‌ కంపెనీ. దీనికి దేశవ్యాప్తంగా 15,000 పెట్రోల్‌ బంకులు ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు