ఆచూకీ తెలిపితే రూ. 5లక్షల రివార్డు

9 Jun, 2019 10:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : గల్లంతైన ఏఎన్‌32 రకం విమానం ఆచూకీ తెలిపిన వారికి భారత వాయుసేన 5 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది.  విమానం కోసం తీవ్ర గాలింపు చేపట్టిన అధికారులు.. ఆరు రోజులు గడిచిన ఆచూకీ కనుగొనలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తూర్పు దళానికి చెందిన ఎయిర్‌ మార్షల్‌ ఆర్‌ డి మాథుర్‌ శనివారం ఈ ప్రకటన చేసినట్టు డిపెన్స్‌ పీఆర్‌వో వింగ్‌ కమాండర్‌ రత్నాకర్‌ సింగ్‌ తెలిపారు. విమానం ఆచూకీకి సంబంధించిన ఎలాంటి సమాచారం అందజేసిన వారికి రివార్డును అందజేయనున్నట్టు వెల్లడించారు. గల్లంతైన విమానం గురించి ఎవరైన కొద్దిపాటి సమాచారం అందజేసిన దాన్ని గుర్తించడం తెలిక అవుతుందని పేర్కొన్నారు. సమాచారం తెలుపాల్సిన వారు 0378-3222164, 9436499477, 9402077267, 9402132477 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.

13 మందితో బయలుదేరిన ఏఎన్‌32 విమానం గాలిలోకి ఎగిరిన 33 నిమాషాల అనంతరం గల్లంతైన సంగతి తెలిసిందే. అస్సాం లోని జొర్హాత్‌ నుంచి మధ్యాహ్నం 12.27 గంటలకు బయలుదేరిన ఈ విమానం అరుణాచల్‌ప్రదేశ్‌లోని మెంచుకాకు (చైనా సరిహద్దుకు దగ్గర్లో) చేరాల్సి ఉండగా, మార్గమధ్యంలోనే కనిపించకుండా పోయింది.  విమానం గల్లంతైన మరుక్షణం నుంచే అధికారులు దాని ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. విమానం ఆచూకీ కనుగోవడానికి అత్యంత సామర్థ్యం కలిగిన హెలికాఫ్టర్లను కూడా వాయుసేన రంగంలోకి దించింది. అయితే కొండ ప్రాంతాలు కావడంతో  ప్రతికూల పరిస్థితుల వల్ల అన్వేషణ ఇబ్బందికరంగా మారింది. అధికారులు ఇస్రో సాయం తీసుకున్నప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. 

మరిన్ని వార్తలు