Uttarkashi tunnel collapse: నెమ్మదించిన రెస్క్యూ ఆపరేషన్‌

16 Nov, 2023 05:57 IST|Sakshi
భారత వాయుసేన విమానంలో డ్రిల్లింగ్‌ యంత్రాన్ని తీసుకొస్తున్న దృశ్యం

శిథిలాలు పడటంతో సహాయక చర్యలకు ఆటంకం

ఆగర్‌ మెషీన్‌తో ముందుకు సాగని పనులు

డ్రిల్లింగ్‌ వేగవంతానికి మరో భారీ యంత్రం

ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌లోని ఛార్‌ధామ్‌ మార్గంలో సొరంగం కుప్పకూలి నాలుగు రోజులుగా లోపల చిక్కుబడిపోయిన 40 మంది కార్మికులను రక్షించే పనులను అధికారులు వేగవంతం చేశారు. ఇందుకోసం మరో భారీ యంత్రాన్ని తెప్పించారు. మూడు విడిభాగాలుగా యుద్ధవిమానాల్లో తరలించిన ఈ యంత్రాన్ని అసెంబుల్‌ చేసి, మరికొద్ది గంటల్లో డ్రిల్లింగ్‌ ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.

కుప్పకూలిన టన్నెల్‌ శిథిలాల గుండా ఆగర్‌ మెషీన్‌ సాయంతో వెడల్పాటి స్టీల్‌ పైపులను లోపలికి పంపే పనులు అధికారులు మంగళవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. 800, 900 మిల్లీమీటర్ల వ్యాసమున్న స్టీలు పైపులను ఒకదాని తర్వాత ఒకటి లోపలికి పంపించి వాటి గుండా కార్మికులను వెలుపలికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, రాత్రి వేళ డ్రిల్లింగ్‌ పనులు జరుగుతున్న సమయంలో మరోసారి టన్నెల్‌ శిథిలాలు విరిగిపడటంతో ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటనతో పనులకు అంతరాయం ఏర్పడింది.

రంగంలోకి అమెరికన్‌ ఆగర్‌
అధికారులు హుటాహుటిన భారీ అమెరికన్‌ ఆగర్‌ డ్రిల్లింగ్‌ మిషన్‌ భాగాలను భారత వాయుసేన విమానాల ద్వారా 30 కిలోమీటర్ల దగ్గర్లోని చిన్యాలిసౌర్‌కు తెప్పించారు. అక్కడి నుంచి ఘటనాస్థలికి రోడ్డు మార్గంలో తీసుకువస్తున్నామని ఎస్‌పీ అర్పణ్‌ తెలిపారు. వీటిని అసెంబ్లింగ్‌ చేసి, పనులు ప్రారంభిస్తామని చెప్పారు. సొరంగం లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు థాయ్‌లాండ్, నార్వే నిపుణుల సలహాలను తీసుకుంటున్నట్లు నేషనల్‌ హైవేస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌(ఎన్‌హెచ్‌ఐడి) డైరెక్టర్‌ అన్షు మాలిక్‌ తెలిపారు. 2018లో థాయ్‌లాండ్‌లోని ఓ గుహలో చిక్కుకుపోయిన ఫుట్‌బాల్‌ జట్టు జూనియర్‌ ఆటగాళ్లను అక్కడి సంస్థ నిపుణులు వారం పాటు శ్రమించి సురక్షితంగా తీసుకువచి్చన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు