వివాదాస్పద ప్రాంతాల నుంచి వెనక్కి మళ్లాల్సిందే..

15 Jul, 2020 04:41 IST|Sakshi

భారత్‌–చైనా కమాండర్ల సుదీర్ఘ చర్చలు

న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని వివాదాస్పద ప్రాంతాల నుంచి ఇరు దేశాల బలగాలు ఎప్పటిలోగా వెనక్కి వెళ్లాలన్న దానిపై ప్రణాళిక రూపొందించేందుకు భారత్‌–చైనా మిలిటరీ కమాండర్లు మంగళవారం సమావేశమయ్యారు. 10 గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. లెఫ్టినెంట్‌ జనరల్‌ అధికారుల స్థాయిలో జరిగిన ఈ నాలుగో సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంట ఉన్న సాయుధ బలగాలు, ఆయుధాలను సాధ్యమైనంత త్వరగా వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు. తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దులో మే 5వ తేదీకి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించాలని భారత కమాండర్లు పేర్కొన్నారు. ఇందుకు ఇరు దేశాలు చర్యలు చేపట్టాలని కోరారు. లద్ధాఖ్‌లోని కొన్ని ప్రాంతాలను తమ భూభాగాలుగా చైనా కొనసాగిస్తూ చేస్తున్న కొత్త వాదన పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. చర్చల్లో భారత్‌ బృందానికి లెఫ్టినెంట్‌ జనరల్‌ హరీందర్‌ సింగ్‌ నేతృత్వం వహించారు.

>
మరిన్ని వార్తలు