సాక్షి,ముంబయిః ప్రధాన్మంత్రి ఆవాస్ యోజన కింద మధ్యాదాయ వర్గాలకు ఇచ్చే రూ 2.60 లక్షల వడ్డీ రాయితీ పథకాన్ని మరో 15 నెలలు పొడిగించారు. ఈ ఏడాది డిసెంబర్తో ముగియనున్న ఈ స్కీమ్ను 2019 మార్చి వరకూ పొడిగించినట్టు అధికారులు తెలిపారు. 2022 నాటికి అందరికీ ఇల్లు ఆశయం నెరవేర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా తెలిపారు. ప్రధాన్మంత్రి ఆవాస్ యోజన పథకం కింద క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ను ప్రధాని గత ఏడాది తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన విషయం విదితమే.
2022 నాటికి దేశ ప్రజలందరికీ ఇళ్లు సమాకూర్చే లక్ష్యంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఈ గృహాల నిర్మాణంలో బిల్డర్లు, ప్రైవేటు ఇన్వెస్టర్ల భాగస్వామ్యాన్ని ప్రభుత్వం స్వాగతిస్తుందన్నారు.