నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ- సీ 47 రాకెట్

27 Nov, 2019 09:14 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ- సీ 47 వాహక నౌక దూసుకెళ్లింది. 14 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ- సీ 47 వాహకనౌక మోసుకెళ్లింది. ఈ వాహననౌక భూమిని వీడిన అరగంటలోపే కార్టోశాట్‌-3తో పాటు అమెరికాకు చెందిన మరో 13 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ- సీ 47 వాహకనౌక నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించింది. అంటార్కిటికాలోని ఇస్రో కేంద్రం పీఎస్‌ఎల్‌వీ సంకేతాలను అందుకోనుంది.

కార్టోశాట్‌-3 ఉపగ్రహం భూవాతావరణం, విపత్తులను హెచ్చరించనుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రణాళికలు, రహదారుల నెట్‌వర్క్‌ పరిశీలన, నీటి సరఫరాపై అధ్యయనానికి ఇది ఉపయోగపడనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో కార్టోశాట్‌-3ని రూపొందించింది. 1,625 కిలో బరువున్న కార్టోశాట్‌-3 జీవితకాలం ఐదేళ్ల పాటు సేవలందించనుంది. ఉపగ్రహం తయారీకి ఇస్రో రూ.350 కోట్లు ఖర్చు చేసింది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్‌ శివన్‌ మాట్లాడుతూ.. ప్రయోగంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. వచ్చే మార్చి లోగా మరో 6 రాకెట్లతో 13 మిషన్లు ప్రయోగించనున్నట్లు తెలిపారు. ఈ విజయం భవిష్యత్‌ ప్రయోగాలకు మరింత స్పూర్తినిస్తుందని ఇస్రో చైర్మన్‌ డా. శివన్‌ అన్నారు. 

పీఎస్‌ఎల్‌వీ సీ-47 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించినందుకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ప్రయోగ పర్వంలో ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషిని చూసి దేశం మొత్తం గర్విస్తోందన్నారు. రాబోయే రోజుల్లో ఇస్రో బృందానికి ఇలాంటి మరెన్నో అద్భుతమైన విజయాలు దక్కాలని ఆయన మనసారా ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు