ఈ ప్రశ్నకు జవాబు లేదు..!

30 Nov, 2015 18:21 IST|Sakshi

శ్రీనగర్: జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులకు జవాబు లేని ప్రశ్న ఎదురైంది. సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ ప్రశ్నాపత్రంలో 'ఏ పార్టీ భాగస్వామ్యంతో అధికార పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది' అనే ప్రశ్న ఉంది. ఈ మల్టీపుల్ చాయిస్ ప్రశ్న కింద (బిట్) నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. ఈ నాలుగింటిలో ఒక్కటీ జవాబు (బీజేపీ) లేదు. దీంతో విద్యా శాఖ అధికారులు చేసిన నిర్వాకం వల్ల జవాబు ఏం రాయాలో తెలియక విద్యార్థులు గందరగోళంలో పడ్డారు.

జమ్ము కశ్మీర్లో బీజేపీతో కలసి పీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాబట్టి ఆ ప్రశ్నకు బీజేపీ అన్నది సమాధానం. అయితే ఆ ప్రశ్న కింద కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, సీపీఎం, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) అనే నాలుగు సమాధానాలు ఇచ్చారు. వీటిలో బీజేపీ పేరు లేకపోవడంతో విద్యార్థులు ఆ ప్రశ్నను విడిచిపెట్టారు. ఆ రాష్ట్ర విద్యా శాఖ అధికారులు స్పందిస్తూ ఈ విషయంపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మరిన్ని వార్తలు