ఖైదీల నుంచి కోట్లలో వసూళ్లకు పాల్పడ్డారు

14 Nov, 2023 05:41 IST|Sakshi

ఢిల్లీ మాజీ మంత్రి జైన్‌పై సీబీఐ ఆరోపణలు

న్యూఢిల్లీ: జైలులో విలాసవంతమైన జీవితం గడిపేందుకు సుకేశ్‌ చంద్ర శేఖర్‌ వంటి హై ప్రొఫైల్‌ ఖైదీల నుంచి ఢిల్లీ జైళ్ల శాఖ మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్, ఆ శాఖ మాజీ డీజీ సందీప్‌ గోయెల్‌ కోట్లలో వసూళ్లకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. ఈ మేరకు వారిపై కేసు నమోదుకు అనుమతివ్వాల్సిందిగా ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనాను కోరింది.

సత్యేందర్‌ జైన్‌తోపాటు జైలు అధికారి రాజ్‌కుమార్‌లపై కేసు నమోదు కోసం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనాకు, సస్పెండైన ఐపీఎస్‌ అధికారి గోయెల్, రిటైర్డు ఐఏఎస్‌ ముకేశ్‌ ప్రసాద్‌లపై చర్యలకు కేంద్ర హోం శాఖకు వినతి పంపినట్లు సీబీఐ వివరించింది. వసూళ్లకు పాల్పడిన ఆరోపణలతో గత ఏడాది గోయెల్‌ను కేంద్ర హోం శాఖ సస్పెండ్‌ చేసింది. జైలులో విలాసవంతమైన జీవితం గడిపేందుకు మోసగాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌ 2018–21 సంవత్సరాల మధ్య సుమారు రూ.12.50 కోట్లను వేర్వేరు మార్గాల్లో వీరికి ముట్టజెప్పినట్లు తమకు సమాచారం ఉందని సీబీఐ అంటోంది.

మరిన్ని వార్తలు