పశువుల దాణా కోసం ప్రాణాలు పణం

20 Oct, 2017 12:44 IST|Sakshi

సాక్షి, డెహ్రాడూన్‌ : అది అల్‌మోరా జిల్లా ప్రభుత్వాసుపత్రి.. ప్రతీ నాలుగైదు రోజులకోకసారి తీవ్ర గాయాలతో మహిళలు ఆస్పత్రిలో చేరుతున్నారు. వారంతా చిరుతల దాడుల్లోనే గాయపడి అక్కడ చేరటం విశేషం. వీరంతా తమ పశువుల మేత కోసం అడవుల్లోకి వెళ్లిన సమయంలోనే ఇలాంటి దాడులు చోటుచేసుకోవటం విశేషం.

పది రోజుల క్రితం ఆల్‌మోరా జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిల్ఖా గ్రామానికి చెందిన పూజా దేవి పశువుల కోసం గడ్డి తెచ్చేందుకు సమీపంలోని అడవికి వెళ్లింది. అక్కడ ఓ చిరుతపులి ఆమెపై దాడి చేయగా.. అక్కడే ఉన్న ఉమా దేవి ఆమెను రక్షించే క్రమంలో గాయపడింది. వారి కేకలు విన్న చుట్టు పక్కల స్థానికులు పరిగెత్తుకుంటూ వెళ్లి చిరుతను తరిమారు. ఇద్దరూ తీవ్రంగా గాయపడినప్పటికీ.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. 

అయితే ఇది తమకు చాలా ఏళ్లుగా అలవాటైపోయిందని ఉమా దేవి చెబుతున్నారు. మాకు పశువులంటే ప్రాణం. అవే మాకు జీవనాధారం. గడ్డి లేకపోతే అవి ఎలా బతుకుతాయి. అందుకే అడవికి వెళ్లక తప్పటం లేదు అని ఆమె చెప్పారు. కొండ ప్రాంతంలో జీవనాధరం లేకపోతే చాలా కష్టం. గిరిజనులు.. పైగా నిరక్షరాస్యులు. వేరే పని లేకపోవటంతో అక్కడ చాలా మట్టుకు పశు సంరక్షణ మీదే ఆధారపడి జీవిస్తున్నారు. వారి కుటుంబాలకు తిండి పెట్టే మూగ జీవాల కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు అని జోయ్‌ హల్కే అనే మహిళా షూటర్ చెబుతున్నారు.  

సమస్య దశాబ్దం పైదే  ...

ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇప్పటిదాకా 600 మంద చిరుతల బారిన పడి చనిపోగా, 3100 మంది గాయపడ్డారు. అంటే సగటున ఏడాదికి 35 మంది చిరుత పంజాకు బలవుతున్నారన్న మాట. వీరిలో 30 శాతం మంది పురుషులు, 20 శాతం మంది పిల్లలు, ఇక మిగిలిన 50 శాతం మహిళలే కావటం గమనార్హం. 

ఆల్‌మోరా, పౌరీ జిల్లాల్లో ఈ దాడులు ఏటా ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఇప్పటిదాకా 150 చిరుతలను మ్యాన్‌ ఈటర్‌లుగా గుర్తించి వాటిలో 40ని మట్టుపెట్టగలిగారు. మరో 40 చిరుతలను బంధించగలిగారు. గ్రామస్థులను అడవుల్లోకి వెళ్లొద్దని విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ.. ప్రత్యామ్నయ మార్గాలు లేకపోవటంతో వాళ్లు వాళ్ల జీవితాలను పణంగా పెడుతున్నారని దిగ్విజయ్‌ సింగ్‌ ఖటి అనే అటవీ అధికారి చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు