క్యూ లైన్లలో లొల్లి లేకుండా..

12 Dec, 2016 14:28 IST|Sakshi
క్యూ లైన్లలో లొల్లి లేకుండా..

మొరాదాబాద్: బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలు కొనసాగుతున్నాయి. క్యాష్‌ కొరతతో ఏటీఎంలలో బ్యాంకు సిబ్బంది డబ్బు నింపడం లేదు. అందువల్ల ఎక్కువ శాతం ఏటీఎంల వద్ద నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఏటీఎంలలో డబ్బు నింపినా.. ఆ పక్కనే ఉన్నవారికి తెలిసేలోపే క్యాష్‌ అయిపోతుంది. దీంతో బ్యాంకు సిబ్బంది డబ్బు నింపేలోపే ఏటీఎంల వద్ద జనం క్యూ కడుతున్నారు.

కొన్ని చోట్ల క్యూ లైన్లలోని జనంలో పెరిగిపోతున్న అసహనం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది. చాలా చోట్ల ఘర్షణలు నివారించేందుకు పోలీసులు క్యూలను నియంత్రిస్తున్నారు. అయితే.. ఉత్తర ప్రదేశ్ మొరాదాబాద్‌లోని ఏటీఎంల వద్ద ఉద్రిక్తతలకు తావు లేకుండా జనం కొత్త పద్దతిని అనుసరిస్తున్నారు. క్యూలో నిలుచున్న జనం చేతిపైనే వారి సీరియల్‌ నంబర్‌ను మార్కర్‌తో రాస్తున్నారు. దీంతో క్యూ లైన్లలో తలెత్తే ఘర్షణలను నివారిస్తున్నామని స్థానికులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు