సాక్షి, ముంబయి : ప్రభుత్వ ఉద్యోగాల్లో జనరల్ క్యాటగిరీ కింద అనాధలకు ఒక శాతం రిజర్వేషన్ కల్పించేందుకు మహారాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగాలకు దరఖాస్తు చేసే సమయంలో తమ కులమేంటో తెలియని అనాధలకు ఊరట లభించిందని అధికారులు పేర్కొన్నారు. జనరల్ క్యాటగిరీ కింద రిజర్వేషన్లు కల్పించడంతో అనాధలకు ఉద్యోగాలు ఇతర సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
ప్రభుత్వ నిర్ణయంతో అనాధ పిల్లల పునరావాసం సులభతరమవడంతో పాటు వారి భవిష్యత్కూ భరోసా ఏర్పడిందని మహిళా శిశు సంక్షేమ మంత్రి పంకజ ముండే చెప్పారు. అనాధలకు వారి కులానికి సంబంధించిన వివరాలు తెలియకపోవడంతో వారికి విద్యా, వ్యాపార, సామాజిక రాయితీలు, రుణాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తాజా నిర్ణయంతో అనాధల జీవితాల్లో వెలుగు నింపామని మంత్రి పేర్కొన్నారు.