కేంద్రం ఈ దిశగా ఆలోచిస్తోందా?

4 Aug, 2019 03:47 IST|Sakshi

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో కేంద్రం ప్రధానంగా రెండు మార్గాలను పరిశీలిస్తున్నట్లు న్యాయ, రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఇందులోభాగంగా కశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్‌ 35ఏ, ఆర్టికల్‌ 370లను కేంద్రం రద్దుచేయడం మొదటిది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు జమ్మూకశ్మీర్‌లో ఆస్తులను కొనుగోలు చేసేందుకు, అక్కడే స్థిరపడేందుకు వీలు కలుగుతుంది. అయితే ఈ నిర్ణయంతో భారత్‌లో విలీనమయ్యేందుకు కశ్మీర్‌తో చేసుకున్న ఒప్పందం చెల్లకుండాపోయే ప్రమాదముంది. దీన్ని నివారించేందుకు జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో కలిపేస్తున్నట్లు రాష్ట్రపతి కోవింద్‌ ఆదేశాలు జారీచేసినా అనేక న్యాయపరమైన చిక్కుముళ్లు ఎదురవుతాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

మూడు ముక్కలు చేయడం..
ఇక రెండో ప్రతిపాదన ఏంటంటే జమ్మూకశ్మీర్‌ను మూడు ముక్కలు చేయడం. అంటే జమ్మూను ఓ రాష్ట్రంగా, కశ్మీర్, లడఖ్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చే ప్రతిపాదన కేంద్రం దృష్టిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది అనుకున్నంత సులభమేంకాదని రాజ్యాంగ, న్యాయ నిపుణులు అంటున్నారు. రాష్ట్రాన్ని విడగొట్టాలంటే సమగ్రమైన అధ్య యనాలతో పాటు సరిహద్దుల ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం చాలా సమయం పడుతుంది. కానీ ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం యత్నాలు ప్రారంభించినట్లు ఇప్పటివరకూ ఎలాంటి సంకేతాలు లేవన్నది నిపుణుల మాట. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

మరిన్ని వార్తలు