సీఎం అత్యాచారం చేశారు; జోక్యం చేసుకోలేమన్న సుప్రీం!

15 Mar, 2019 19:51 IST|Sakshi

న్యూఢిల్లీ : అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమా ఖండు సహా ముగ్గురు వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించలేమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. 2008లో జరిగినట్లుగా భావిస్తున్న ఈ ఘటనలో తాము జోక్యం చేసుకోలేమని సీజేఐ రంజన్‌ గొగోయ్‌, దీపక్‌ మిశ్రా, సంజీవ్‌ ఖన్నాలతో కూడిన ధర్మాసనం తేల్చిచెప్పింది. ఈ మేరకు హైకోర్టును ఆశ్రయించాలని, అదే విధంగా రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను కోరాలని సూచించింది. కాగా సీఎంకు వ్యతిరేకంగా తాను చేసిన ఫిర్యాదును చీఫ్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌, పోలీసులు స్వీకరించినందువల్లే సుప్రీంకోర్టును ఆశ్రయించానని సదరు మహిళ పేర్కొన్నారు.

పిటిషన్‌లో ఉన్న వివరాల ప్రకారం..
తాను మైనర్‌గా ఉన్న సమయంలో సీఎం పెమా ఖండు సహా ముగ్గురు వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత మహిళ పిటిషన్‌లో పేర్కొన్నారు. అందులో ఉన్న వివరాల ప్రకారం.. ‘15 ఏళ్ల వయస్సులో నాపై నలుగురు వ్యక్తులు నాపై అత్యాచారం చేశారు. అప్పుడు నేను పబ్లిక్‌ కాల్‌ ఆఫీసులో పనిచేస్తున్న సమయంలో ఓ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని ఆశ చూపాడు. అతని మాటలు నమ్మి ఓ రోజు కలవడానికి వెళ్లాను. ఆ సమయంలో కూల్‌డ్రింకులో మత్తుమందు కలిపి స్పృహ తప్పేలా చేశారు. అనంతరం నలుగురు వ్యక్తులు నాపై అత్యాచారానికి పాల్పడ్డారు’ అని పేర్కొన్నారు. ఇక తనకు జరిగిన అన్యాయంపై బాధిత మహిళ 2018లో జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు.

వ్యవస్థలపై నమ్మకం పోతుంది..
‘ అరుణాచల్‌ ప్రదేశ్‌ సీఎం పెమా ఖండు సహా ముగ్గురు వ్యక్తులపై నేను ఫిర్యాదు చేశాను. కోర్టు నుంచి గానీ, పోలీసుల నుంచి గానీ సరైన స్పందన రావడం లేదు. అందరూ కూడా నన్నో మోసగత్తెగా చూస్తున్నారు. నేను చెప్పేది అబద్ధం అంటున్నారు. ఇక్కడ కూడా నాకు న్యాయం దొరక్కపోతే, నాలాంటి ఎంతో మంది బాధితులకు అన్ని వ్యవస్థలపై నమ్మకం పోతుంది అని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తనపై వస్తున్న ఆరోపణలను సీఎం పెమా ఖండు ఖండించారు. ఇదంతా ప్రతిపక్షాల కుట్రేనని కొట్టిపారేశారు.

మరిన్ని వార్తలు