ఆనంద్ మహీంద్రాను బాధించిన వీడియో.. అందులో ఏముందంటే..?

22 Nov, 2023 12:05 IST|Sakshi

ముంబయి: సోషల్ మీడియాలో చురుకుగా ఉండే మహీంద్రా గ్రూప్ ఛైర్మెన్ ఆనంద్ మహీంద్రా తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో కొందరు వ్యక్తులు వ్యర్థాలను సముద్రంలో పడేస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. ఈ వీడియో తనను ఎంతగానే బాధించినట్లు ఆనంద్ మహీంద్రా ఆవేదన వ్యక్తం చేశారు. 

గేట్‌ వే ఆఫ్ ఇండియా వద్ద సముద్రంలో కొందరు వ్యక్తులు వ్యర్థాలను పడేశారు. కార్లలో వచ్చి బస్తాల్లో తీసుకొచ్చిన వ్యర్థాలను సముద్ర నీటిలో వేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పర్యావరణాన్ని కలుషితం చేయడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలింపు చేపట్టారు. నగర మున్సిపాలిటీ అధికారులు నిందితులకు రూ.10,000 జరిమానా కూడా విధించారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. ఈ వీడియోలోని దృశ్యాలు తనను ఎంతగానో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణం పట్ల ప్రజల అభిప్రాయం మారకపోతే.. జీవన నాణ్యతా ప్రమాణాలు పెరగబోవని పేర్కొంటూ ట్వీట్‌ చేశారు. కాగా.. ఈ వీడియోపై నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అయితే.. నగరాన్ని శుభ్రంగా ఉంచడం కష్టమని అభిప్రాయపడ్డారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరారు.      

ఇదీ చదవండి:  'అలా అయ్యుంటే టీమిండియా వరల్డ్ కప్‌ ఫైనల్‌లో గెలిచేది!

మరిన్ని వార్తలు