చితక్కొట్టిన ఎమ్మెల్యేకే రాఖీ కట్టిన మహిళ

3 Jun, 2019 16:22 IST|Sakshi

అహ్మదాబాద్‌ : ఓ మహిళానేత అని కూడా చూడకుండా నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే బీజేపీ ఎమ్మెల్యే బలరాం తవని దాడికి పాల్పడిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అయితే ఎంత వేగంగా ఈ ఘటన వైరల్‌ అయిందో అంతే వేగంగా సెటిల్‌ అయ్యింది. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై సీరియస్‌ అవ్వడంతో.. 'ఎన్సీపీ మహిళా నేత నీతూ తేజ్‌వాణితో దురుసుగా ప్రవర్తించినందుకు క్షమించండి. ఆమె నా సోదరితో సమానం. మా మధ్య వచ్చిన అవగాహన లోపం వల్లే ఈ ఘటన జరిగింది' అంటూ బలరాం తవని పేర్కొన్నారు. సోమవారం నీతూ తేజ్‌వాణితో కలిసి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టారు. యువతితో రాఖీ కట్టించుకున్నారు. కేవలం అవగాహన లోపం వల్లే నిన్నటి ఘటన జరిగిందని అవన్నీ మర్చిపోయి ప్రజా సమస్యల పరిష్కారానికి కలిసి పని చేస్తామని బలరాం అన్నారు. నీతూ తేజ్‌వాణి కూడా విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేకు రాఖీ కట్టి బలరాం నా సోదరుడులాంటివాడు, మాది ఒకే కుటుంబం అంటూ చెప్పుకొచ్చింది. ఒకే రోజులో మ్యాటర్‌ మొత్తం సెటిల్‌ అవ్వడంతో .. సోషల్‌ మీడియాలో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. 

సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చిన నీతూ తేజ్‌వాణిపై ఎమ్మెల్యే బలరాం ఆయన అనుచరులు భౌతిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌ నగరంలోని నరోదా నియోజకవర్గ ఎమ్మెల్యే బలరాం తవని నీతూ తేజ్‌వాణిని కొడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మంచినీటి కొరతపై ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన మహిళపై ఆయన కార్యాలయం వెలుపలే దాడి జరిగింది. కిందపడిపోయిన మహిళను ఎమ్మెల్యే బలరాం తవని గట్టిగా కొడుతున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. కాగా అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నరోదా వార్డుకు గతంలో కార్పొరేటర్‌గా పనిచేసిన ఆయన 2017లో నరోదా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గుజరాత్‌ అసెంబ్లీలో​అడుగుపెట్టారు.

సంబంధిత వీడియో కోసం క్లిక్‌ చేయండి :
బీజేపీ ఎమ్మెల్యే ప్రవర్తన వివాదాస్పదం

>
మరిన్ని వార్తలు