బుకింగ్ నిబంధనల్లో మార్పుల్లేవు: రైల్వే

24 Jun, 2016 01:44 IST|Sakshi

న్యూఢిల్లీ: రైల్వే బుకింగ్, తత్కాల్‌లకు సంబంధించిన జులై 1 నుంచి నిబంధనలు మారుతున్నాయంటూ సోషల్ మీడియాలో, కొన్ని వెబ్‌సైట్లలో వస్తున్న వార్తలు సరికాదంటూ రైల్వే శాఖ ప్రకటించింది. ‘అది తప్పుడు ప్రచారం. నిర్ధారించుకోకుండానే కొన్ని పత్రికలు ఈ విషయాన్ని ప్రచురించాయి. దీని వల్ల గందరగోళం నెలకొంది. శతాబ్ది, రాజధాని రైళ్లలోనే కాదు ఏ రైళ్లలోనూ పేపర్ టికెట్లను తొలగించే ఆలోచన లేదు. అయితే, ఆన్‌లైన్లో టికెట్ బుక్ చేసుకున్నవారు, టికెట్ కన్ఫర్మేషన్‌కు సంబంధించి వారికందిన ఎస్‌ఎంఎస్‌తో పాటు, నిర్ధారిత గుర్తింపు పత్రంతో ప్రయాణం చేయవచ్చు.

రద్దు చేసుకున్న ప్రయాణాలకు సంబంధించి తిరిగి చెల్లింపుల(రీఫండ్) నిబంధనల్లోనూ ఎలాంటి మార్పుల్లేవు’ అని గురువారం రైల్వే శాఖ స్పష్టం చేసింది.  టిక్కెట్లపై చార్జీల్లో రాయితీలను కూడా ప్రచురించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. చార్జీపై ప్రయాణికులు ఎంత రాయితీ పొందుతున్నారో వారికి తెలియాలని, చార్జీల హేతుబద్ధీకరణకు ఇది ఉపయోగపడుతుందని రైల్వే బోర్డు మెంబర్ మహ్మద్ జంషెడ్  చెప్పారు.

ప్రయాణికులను గ మ్యం చేర్చడానికి తమకయ్యే ఖర్చులో 57 శాతం మాత్రమే చార్జీల ద్వారా తిరిగి వస్తుందనీ, సబర్బన్ రైళ్లలో అయితే ఇది కేవలం 37 శాతమేనని ఆయన చెప్పారు. మొత్తం రైళ్ల ట్రాఫిక్‌లో సబర్బన్, తక్కువ దూరం ైరె ళ్ల ట్రాఫిక్ శాతం 52 అని, కానీ ఆదాయార్జనలో వీటి వాటా 6 నుంచి 7 శాతమేనని జంషెడ్ వివరించారు.

మరిన్ని వార్తలు