ప్రస్తుతం ఆస్తి రూ.63 కోట్లు

21 Mar, 2019 12:48 IST|Sakshi

భువనేశ్వర్‌ : దేశంలోనే అత్యంత నిరాడంబరుడైన ముఖ్యమంత్రుల్లో నవీన్‌ పట్నాయక్‌ ఒకరు. అలాంటిది గడిచిన ఐదేళ్లలో ఆయన ఆస్తుల విలువ దాదాపు ఐదు రెట్లు పెరిగింది. అయితే ఇందులో కొత్తగా కూడబెట్టిన ఆస్తులేవి లేవు. గతంలో ఉన్న ఆస్తుల మార్కెట్‌ విలువ పెరగడం వల్లే ప్రస్తుతం ఆయన ఆస్తి ఐదు రెట్లు పెరిగిందంటున్నారు అధికారులు. నిన్ననే హింజిలీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఛత్రాపూర్‌ సబ్‌ కలెక్టర్‌ ఆఫీసులో నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా  నవీన్‌ పట్నాయక్‌ ప్రస్తుతం తన పేర రూ. 63 కోట్ల ఆస్తులున్నట్లుగా ఎన్నికల ప్రమాణపత్రంలో పేర్కొన్నారు.

అయితే 2014 నాటికి బంగారం, నగదు, ఇళ్లు, వాహనాల మొత్తం కలిపి రూ. 12 కోట్ల ఆస్తులున్నట్లు చూపించారు. ప్రస్తుతం వీటి విలువ ఐదురెట్లు పెరగడంతో ఆస్తి మొత్తం రూ.63 కోట్లు అయ్యింది. ప్రస్తుతం నవీన్‌ పట్నాయక్‌ చేతిలో రూ. 25 వేల నగదుతో పాటు తొమ్మిదివేల రూపాయలు విలువ చేసే 1980 నాటి మోడల్‌ అంబాసిడర్‌ కార్‌ ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా నవీన్‌ పట్నాయక్‌ తొలిసారి రెండు అసెంబ్లీ  స్థానాల బరిలో నిలువనున్నారు. అందులో ఒక స్థానం హింజిలీ కాగా మరొకటి బిజేపూర్‌.

మరిన్ని వార్తలు