పని చేయని ప్రశాంత్‌ కిషోర్‌ టెక్నిక్‌

11 Mar, 2017 18:09 IST|Sakshi
పని చేయని ప్రశాంత్‌ కిషోర్‌ టెక్నిక్‌

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాజకీయ వ్యూహాల ముందు ప్రశాంత్ కిషోర్ టెక్నిక్‌లు పని చేయలేదు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్ భారత రాజకీయ ప్రచార రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీని, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్‌ను విజయపథాన నడిపించడంతో ప్రశాంత్ కిషోర్ పేరు దేశవ్యాప్తంగా మర్మోగిపోయింది. అయితే ఈ సారి కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్‌ మ్యాజిక్ వర్కవుట్ కాలేదు. అంతేకాకుండా  యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, ప్రశాంత్కు విభేదాలు వచ్చినట్టు సమాచారం.

మరోవైపు 90వ దశకం తర్వాత యూపీలో నానాటికి ఆదరణ కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ తాజా ఎన్నికల్లో మరింత ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సమాజ్‌వాదీతో పొత్తు కట్టినా హస్తం పార్టీకి ప్రయోజనం రాలేదు. పైగా పార్టీ చరిత్రలో యూపీలో అత్యంత దారుణ స్థాయికి పడిపోయింది. అఖిలేష్‌ యాదవ్‌తో బేరాలాడి మరీ 105 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ పట్టుమని పది స్థానాలను కూడా గెలవలేకపోయింది. కేవలం ఏడు స్థానాలతో సరిపెట్టుకుంది.

 అలాగే  హస్తం పార్టీ కంచుకోటలైన అమేథీ, రాయ్‌బరేలీల్లో కూడా కాంగ్రెస్‌కు ఆధిక్యం రాలేదు. ఆ రెండు నియోజకవర్గాల్లో ప్రియాంకాగాంధీ స్వయంగా ప్రచారం చేసినా కూడా హస్తం అభ్యర్థులు గెలవలేకపోయారు. ప్రియాంకా గాంధీ స్వయంగా రంగంలోకి దిగినా ఫలితం దక్కలేదు. దీంతో ప్రియాంక కేవలం కాగితం పులిగానే మిగిలిపోయారంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. మోదీ అభివృద్ధి పనులతోనే యూపీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని ఆమె వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు