ఉత్తరాఖండ్ వరద సహాయక చర్యల్లో మృతి చెందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) అధికారి అఖిలేష్ కుమార్ అంత్యక్రియలకు కాంగ్రెస్ పార్టీ యువనేత, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ మధ్యాహ్నం స్థానిక ఎంపీతో కలిసి ఫుర్ సాత్ గంజ్ విమానాశ్రయానికి రాహుల్ చేరుకున్నారు. అక్కడి నుంచి దీహ్ ప్రాంతంలోని పురె నాగో గ్రామానికి చేరుకుని అఖిలేష్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అఖిలేష్ భార్య అంజు సింగ్, తండ్రి విక్రంజిత్ సింగ్ లను ఓదార్చారు. చేయాల్సిన సాయమంతా చేస్తామని హామీయిచ్చారు. అలాగే అఖిలేష్ ఇద్దరు పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తామని రాహుల్ భరోసా ఇచ్చారని స్థానిక ఎంపీ తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే తనతో నేరుగా మాట్లాడాలని రాహుల్ సూచించారన్నారు. తర్వాత అఖిలేష్ కుమార్ అంత్యక్రియలకు రాహుల్ గాంధీ హాజరయ్యారు.
ఉత్తరాఖండ్ లో ఈనెల 25న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అఖిలేష్ ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో 20 మంది మృతి చెందగా ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇద్దరు ఐఏఎఫ్ అధికారులున్నారు.