మానస సరోవర్‌లో విద్వేషం లేదు: రాహుల్‌

6 Sep, 2018 04:50 IST|Sakshi

న్యూఢిల్లీ: కైలాస మానససరోవర్‌ యాత్రలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బుధవారం మానససరోవర్‌ సరస్సు ఫొటోలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. ‘మానససరోవర్‌ సరస్సులోని నీళ్లు ఎంతో స్వచ్ఛమైనవి, ప్రశాంతమైనవి. ఈ నీటిని ఎవరైనా తాగవచ్చు. ఇక్కడ ఎలాంటి ద్వేషభావమూ లేదు. అందుకే ఈ నీటిని భారత్‌లో మేం పూజిస్తాం‘ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. మానససరోవర్‌ సరస్సుతో పాటు అక్కడి పరిసరాలకు సంబంధించి రెండు ఫొటోలను రాహుల్‌ తన ట్వీట్‌కు జతచేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 26న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం కోసం ఢిల్లీ నుంచి హుబ్లీకి బయలుదేరిన రాహుల్‌ విమానానికి పెనుప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. ఈ విమానం గాల్లో ఉండగానే ఒక్కసారిగా ఎడమవైపుకు ఒరిగిపోయి వందల అడుగులు కిందకు వచ్చేసినా, పైలెట్లు చాకచక్యంగా దాన్ని నియంత్రణలోకి తెచ్చుకోగలిగారు. ఈ నేపథ్యంలో కైలాస మానససరోవర్‌ యాత్రకు వెళ్లాలని తన మనసులో బలంగా అన్పించిందని రాహుల్‌ అప్పట్లో చెప్పారు.

>
మరిన్ని వార్తలు