మళ్లీ కరోనా ప్రమాద ఘంటికలు..మరో రూపంతర వేరియంట్‌ కలకలం!

17 Dec, 2023 12:51 IST|Sakshi

కరోనా మహమ్మారి పూర్తిగా వెళ్లిపోయిందనుకునేలోపు ఎక్కడో ఒక చోట ఏదో కేసు రూపంలో నమోదై నేనింకా ఉన్నానని చెబుతూనే ఉంటోంది. ఇప్పటి వరకు దాని రూపాంతర వేరియంట్‌ ఒమిక్రాన్‌ బీఏ 2.86 వంటి కేసులను ఫేస్‌ చేశాం. మళ్లీ మరో రూపంతరం మార్చుకుని జేఎన్‌ 1 అనే కరోనా కొత్త వేరియంట్‌ కేసులతో  కలకలం సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన తొలి కేసును ఈ ఏడాది సెప్టెంబర్‌లో అమెరికాలో గుర్తించారు శాస్త్రవేత్తలు. ఆ తర్వాత ఈ సబ్‌ వేరియంట్‌కి సంబంధించిన ఏడు కేసులనే చైనాలో కూడా గుర్తించారు.ఇప్పుడూ ఆ తరహాలోనే తొలి కేసు భారత్‌లో కేరళలోని తిరువనంతపురంలో నమోదయ్యింది. ఈ కేసులు ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తాయేమోనని శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)తెలిపిన వివరాల ప్రకారం కరోనాకు చెందిన ఈ సబ్‌వేరియంట్ ఓమిక్రాన్ సబ్‌వేరియంట్ బీఏ.2.86 వంశానికి చెందినది. దీనిని ‘పిరోలా’ అని కూడా అంటారు. శాస్త్రవేత్తలు వెల్లడించిన వివరాల ప్రకారం, జేఎన్‌.1, బీఏ.2.86 మధ్య ఒకే ఒక మార్పు కనిపిస్తోంది. అదే స్పైక్ ప్రోటీన్‌లో మార్పు. స్పైక్ ప్రోటీన్‌ను స్పైక్ అని కూడా అంటారు. ఇది వైరస్ ఉపరితలంపై చిన్న స్పైక్‌ల మాదిరిగా కనిపిస్తుంది. దీని కారణంగా ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది.

జేఎన్‌.1 లక్షణాలు
సీడీసీ తెలిపిన ప్రకారం కరోనాలోని ఈ కొత్త సబ్‌వేరియంట్ నిర్దిష్ట లక్షణాలు ఇంకా పూర్తి స్థాయిలో కనిపించలేదు. అటువంటి పరిస్థితిలో, దాని లక్షణాలు కోవిడ్-19కు చెందిన ఇతర వేరియంట్లకు ఎంత భిన్నంగా ఉన్నాయో నిర్ధారించడం కష్టం. అందుకే కరోనా సాధారణ లక్షణాలే దీనిలోనూ కనిపించవచ్చంటున్నారు. జ్వరం, నిరంతర దగ్గు, త్వరగా అలసిపోవడం, జలుబు, అతిసారం, తలనొప్పి మొదలైన వాటి విషయంలో జనం అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. 

ప్రస్తుతానికి జేఎన్‌.1కి సంబంధించి ఎటువంటి వివరణాత్మక సమాచారం వెల్లడి కాలేదు. సీడీసీ అంచనాల ప్రకారం ఈ వేరియంట్ కేసులు వేగంగా పెరుగుతుండటాన్ని గమనిస్తే, ఇది మన రోగనిరోధక వ్యవస్థ నుండి సులభంగా తప్పించుకోగలదని అంటున్నారు. ఇతర కరోనా వేరియంట్‌ల కంటే జేఎన్‌.1  ప్రమాదకరమా  కాదా అనే విషయంపై ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవని సీడీసీ చెబుతోంది. 

(చదవండి: ఫ్లూ జ్వరంలా ఉందని తేలిగ్గా తీసుకుంది..కట్‌ చేస్తే అంతలోనే..)

>
మరిన్ని వార్తలు