సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ బాలీవుడ్ నటులు రణవీర్ సింగ్, దీపికా పదుకునే జంటగా ఈ ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీ పక్షాన ప్రచారం చేస్తున్నారా ? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వారి ఫొటోలను చూస్తే అవుననే అనుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే వారి భుజాల పై వేలాడుతున్న కాషాయ కండువాలపై ‘వోట్ ఫర్ బీజేపీ ఎన్ మోదీ’ అని రాసి ఉంటుంది. మరో ఫొటో దిగువున ‘కమల్ కా బటన్ తబాకర్ తరఫ్కీమే భాగ్యదార్ బనే (కమలం బటన్ నొక్కి దేశ ప్రగతితో భాగంకండి)’ అనే నినాదం రాసి ఉంది. ఈ రెండు ఫొటోలను ‘ఏక్ భారీ 100 కే భారి’ ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేయగా, 4000 సార్లు షేర్ అయింది.
అలాగే ‘మై బీ చౌకీదార్’ అనే ఫేస్బుక్ గ్రూపులో కూడా వైరల్ అవుతోంది. వాస్తవానికి వీరికి, బీజేపీ ఎన్నికల ప్రచారానికి ఎలాంటి సంబంధం లేదు. వారు 2018, నవంబర్ నెలలో ముంబైలోని సిద్ధి వినాయక్ టెంపుల్ ఆలయాన్ని సందర్శించుకున్నప్పుడు దిగిన ఫొటో. వారి భుజాలపై వేలాడుతున్న కాషాయ కండువాలపై ఎలాంటి ముద్రలు, నినాదాలు లేవు. నాడు పలు పత్రికల్లో వీరి ఈ ఫొటో ప్రచురితమయింది. ఇప్పుడు దీన్ని డిజిటల్ మార్ఫింగ్ చేసి అక్రమంగా ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ వర్గాలు వాడుకుంటున్నాయి. ఇలా అక్రమంగా ఫొటోలను మార్ఫింగ్ చేయడం, నకిలీ వార్తలను సష్టించడం బీజేపీ సోషల్ మీడియాకు పుట్టుకతో అబ్బిన విద్యని తెల్సిందే.