పనాజీ: మైనర్ బాలికను కొనుగోలు చేసి.. రేప్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న గోవా ఎమ్మెల్యే అటనాషియో మాన్సెరాట్ కు ఆదివారం సైక్రియాట్రిక్ పరీక్షలు నిర్వహించనున్నట్టు పోలీసులు తెలిపారు. పనాజీలోని సైకియాట్రీ, హ్యుమన్ బిహెవియర్ ఇన్స్టిట్యూట్కు ఆయనను శనివారం తీసుకెళ్లామని, ఆయనపై శనివారం కొన్ని సైకో టెస్టులు జరుగగా, ఆదివారం కూడా మరిన్ని జరుగనున్నాయని చెప్పారు.
బహిష్కృత కాంగ్రెస్ ఎమ్మెల్యే అటనాసియో మాన్సెరాట్ను గత గురువారం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన మార్చిలో 16 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. రాష్ట్ర మాజీ విద్యాశాఖ మంత్రి కూడా అయిన మాన్సెరాట్ గతంలోనూ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, తన సవతి తల్లి రూ. 50 లక్షలకు తనను ఎమ్మెల్యేకు అమ్మేసిందని బాధితురాలు గురువారం పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపింది. ఎమ్మెల్యే తనను నిర్బంధించి మత్తు మందు ఇచ్చి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొంది. దీంతో అత్యాచారం, అక్రమ నిర్బంధం, విషప్రయోగం, మనుషుల అక్రమ రవాణా నేరారోపణలతో పలు చట్టాల కింద కేసు నమోదు చేశారు. బాలిక సవతి తల్లిపైనా మనుషుల అక్రమ రవాణా తదితర చట్టాల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.