వీణా మాలిక్‌పై మండిపడ్డ సానియా

18 Jun, 2019 16:29 IST|Sakshi

ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా ట్విటర్‌లో తనపై వస్తున్న విమర్శలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన కుమారుడిని ఎలా చూసుకోవాలో తనకు బాగా తెలుసని స్పష్టం చేశారు. తొలుత పాకిస్తాన్‌ నటి వీణా మాలిక్‌ సానియాను ఉద్దేశించి ట్విటర్‌లో ఒక పోస్ట్‌ చేశారు. ‘సానియా నీ కుమారుడిని హుక్కాబార్‌కు తీసుకెళ్లావు. అలాంటి చోట్లకు బాబును తీసుకెళ్లడం అంత మంచిది కాదు. నువ్వు వెళ్లిన బార్లో జంక్ ఫుడ్ అమ్ముతుంటారు. ఇలాంటి ఆహారం నీలాంటి క్రీడాకారులకు అనారోగ్యకరం. ఓ తల్లిగా ఈ విషయాలపై మీకు తెలుసుండాలి’అని వీణా మాలిక్‌ ట్వీట్‌ చేశారు. 

దీనిపై స్పందించిన సానియా.. ‘మా అబ్బాయిని నా కంటే జాగ్రత్తగా ఎవరూ చూసుకోలేరు. నాకు మా అబ్బాయిని ఎక్కడికి తీసుకు వెళ్లాలో తెలుస’ని  పేర్కొన్నారు. అంతేకాకుండా పాకిస్థాన్‌ క్రికెటర్లు ఏం తింటారో పట్టించుకోవడానికి తాను ఆ టీమ్‌ డైటీషియన్ కాదని ఎద్దేవా చేశారు. తాను వారి తల్లిని కాదని, టీచర్ ను అంతకన్నా కాదని వీణా మాలిక్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ట్విటర్‌లో తనపై వ్యంగ్యంగా కామెంట్లు చేసే నెటిజన్లు వారి ప్రస్టేషన్‌ తగ్గించుకోవడాని వేరే మార్గాలు చూసుకోవాలని సానియా చురకలు అంటించారు. ఐసీసీ వరల్డ్‌ కప్‌లో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌ టీమిండియా చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీంతో పాక్‌కు చెందిన పలువురు నెటిజన్లు సానియా గతంలో హుక్కాబార్‌కు వెళ్లిన దృశ్యాలను సోషల్‌ మీడియాలో ఉంచి ట్రోల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు