పోలీసు రక్షణ కల్పించండి: సాన సతీశ్‌

30 Oct, 2018 04:23 IST|Sakshi

న్యూఢిల్లీ: సీబీఐ స్పెషల్‌ డైరెక్టర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు కారణమైన ఫిర్యాదు చేసిన హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సాన సతీశ్‌ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు పోలీసు రక్షణ కల్పించాలని, విచారణకు రావాలని సీబీఐ జారీ చేసిన నోటీసులపై స్టే విధించాలని ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. మాంసం వ్యాపారి మొయిన్‌ ఖురేషీ కేసులో ఓ నిందితుడైన సతీశ్‌ ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఈ అక్టోబర్‌ 15న అస్థానాపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తన ప్రాణాలకు ముప్పు ఉందని, అందువల్ల తనకు పోలీసు రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో సతీశ్‌ కోరారు. ఎప్పుడు కోరితే అప్పుడు వచ్చి విచారణకు సహకరిస్తానని మాజీ న్యాయమూర్తి ఏకే పట్నాయక్‌కు లేఖ రాసిన విషయాన్ని సతీశ్‌ వెల్లడించారు. సీబీఐ చీఫ్‌ అలోక్‌వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణల విచారణను ముగించేందుకు సీవీసీకి 2 వారాల గడవిచ్చి, పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏకే పట్నాయక్‌ను సుప్రీంకోర్టు నియమించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు