ప్రధాని మోదీపై ఎస్పీ బాలు అసంతృప్తి

3 Nov, 2019 14:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీపై  ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహాత్మ గాంధీ 150 జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సినీ ప్రముఖులతో సమావేశమైన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 29న జరిగిన ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ స్టార్స్‌తో పాటు పలువురు దక్షిణాది సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. అయితే అగ్రతారలకు ఆహ్వానాలు అందకపోవటంతో, కార్యక్రమంలో పాల్గొన్న కొద్ది మంది దక్షిణాది సినీ ప్రముఖులతో మోదీ ఫోటోలు దిగకపోవడంతో సినీ ప్రముఖులు కొంత అసహనం వ్యక్తం చేశారు. దీనిపై రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన ట్విటర్‌ వేదికగా మోదీ తీరుపై విమర్శలు కురిపించారు. దక్షిణాది నటులను ఆహ్వానించకపోవటం ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా దీనిపై మరో ప్రముఖ నటుడు, గాయకుడు స్పందించారు. మోదీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా హాజరయిన విషయం తెలిసిందే.

చదవండి:  ప్రధాని దక్షిణాదిని పట్టించుకోలేదు: ఉపాసన

ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో స్వయంగా ఆయనే వెల్లడించారు. ఆ పోస్ట్‌లో బాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. `కొంత మంది కారణంగా మోదీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు దక్కింది. కార్యక్రమానికి హాజరైన మా ఫోన్లు సెక్యూరిటీ సిబ్బంది తీసుకున్నారు. ఫోన్లు అనుమతి లేదని అన్నారు. కానీ లోపలికి వెళ్లే సరికి బాలీవుడ్‌ స్టార్స్‌ మోదీతో సెల్ఫీలు దిగుతున్నారు. ఈ సంఘటన నన్ను ఎంతో నిరుత్సాహానికి గురిచేసింది’ అంటూ సోషల్‌ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని కార్యాలయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలీవుడ్ సినీ నటులు షారూఖ్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌లతో పాటు పలువురు హీరోయిన్లు కూడా పాల్గొన్నారు.

చదవండి: బాలీవుడ్‌ ప్రముఖులతో ప్రధాని భేటీ

మరిన్ని వార్తలు