హాజరు పలికేటప్పుడు జైహింద్‌ అనాల్సిందే

16 May, 2018 11:04 IST|Sakshi

భోపాల్‌, మధ్యప్రదేశ్‌ : మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇ​‍క నుంచి పాఠశాలల్లో విద్యార్థులు హాజరు పలికేటప్పుడు జైహింద్‌ అనడం తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సాత్నా జిల్లాలో తొలుత దీనిని ప్రయోగాత్మకంగా చేపట్టిన విద్యాశాఖ.. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఈ నిర్ణయాన్ని అమలు చేయనుంది. ఇందుకు సంబంధించి మధ్యప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి విజయ్‌ షా గత డిసెంబర్‌లోనే కసరత్తు ప్రారంభించారు.

ఇదే అంశంపై విజయ్‌ మాట్లాడుతూ.. ఇకపై ప్రభుత్వ పాఠశాలలో ఇక నుంచి విద్యార్థులు ‘యస్‌ సార్‌, యస్‌ మేడమ్‌’కు బదులు జైహింద్‌ అనాలని పేర్కొన్నారు. దీని ద్వారా విద్యార్థుల్లో దేశ భక్తి భావం పెరుగుతోందని తెలిపారు. ఈ నిర్ణయాన్ని ఎవరు వ్యతిరేకిస్తారని అనుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షా ఇరవై రెండు వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నిబంధన అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలలకు దీనికి సంబంధించిన ఆదేశాలను జారీ చేయనున్నట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు