చంద్రుడిపై ఎకరా రూ. 2,300 మాత్రమే!

29 Jun, 2018 02:44 IST|Sakshi

న్యూఢిల్లీ: భూమి ధరలు కొండెక్కాయి.. కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది.. మౌలిక సదుపాయాలు అంతంత మాత్రమే. మరి దీనికి పరిష్కారం లేదా.. ఉంది..! అదే చంద్రుడిపైకి వెళ్లిపోండి ఎంచక్కా.. అది కూడా కేవలం రూ.2 వేలతో! ఇటీవల బాలీవుడ్‌ హీరో సుషాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ చంద్రుడిపై స్థలాన్ని కొన్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.. లూనా సొసైటీ ఇంటర్నేషనల్‌ అనే సంస్థ ద్వారా అక్కడ మూడెకరాల స్థలం కొన్నారు. చంద్రుడిపై, అరుణగ్రహంపై ఆస్తులు అమ్ముతామని చాలా కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాయి.

చంద్రుడిపై ఎకరా స్థలం కేవలం రూ.2,300కే అమ్ముతామని ‘ఓయ్‌ హ్యాపీ’ అనే కంపెనీ చెబుతోంది. చంద్రుడిపై స్థలం కావాలనుకునే వారు ఒక ఫారం నింపి ఇస్తే చాలు.. చంద్రుడిపై స్థలం వివరాలతో కూడిన ఓ సర్టిఫికెట్‌ ఇస్తామని  ఆ కంపెనీ అధికార ప్రతినిధి ఆరిఫ్‌ హుస్సేన్‌ పేర్కొంటున్నారు. అయితే దీన్ని ఎవరికైనా బహుమతిగా ఇవ్వడానికి మాత్రమే పనికొస్తుందని, నిజంగా దీనిపై హక్కులు ఉండవన్నారు. రోజుకు దాదాపు 30 కొనుగోళ్లు జరుగుతున్నాయని, వాలంటైన్స్‌ డే, మదర్స్‌ డే వంటి రోజుల్లో ఈ కొనుగోళ్లు మరింత పెరుగుతున్నాయన్నారు.

మరిన్ని వార్తలు