‘ఆజం ఖాన్‌ మానసిక వికలాంగుడు’

27 Jul, 2019 10:04 IST|Sakshi

న్యూఢిల్లీ :  బీజేపీ ఎంపీ రమాదేవిని ఉద్దేశించి ఎస్పీ నేత ఆజం ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. మహిళా ఎంపీలంతా పార్టీలకు అతీతంగా ఆజం ఖాన్‌ వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ ఆజం ఖాన్‌ వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆజం ఖాన్‌ మానసిక వైకల్యంతో బాధపడుతున్నారని ఆమె ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలపై సుష్మ స్పందిస్తూ... ‘ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆజం ఖాన్‌కు కొత్తేం కాదు. ఆయన బుద్ధే ఇది. సభాధ్యక్షురాలి స్థానంలో ఉన్న ఓ మహిళ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఆజం ఖాన్‌ తన హద్దులను పూర్తిగా అతిక్రమించారు. ఈ విషయంలో ఆయనకు కఠిన శిక్ష విధించి సభ గౌరవమర్యాదలు కాపాడల’ని సుష్మా స్వరాజ్‌ కోరారు. ఇక రమాదేవి ఆజం ఖాన్‌ క్షమాపణలు చెప్తే సరిపోదని.. ఆయనపై ఐదేళ్ల పాటు బహిష్కరణ విధించాలని డిమాండ్‌ చేశారు.

లోక్‌సభ డిప్యూటీ స్పీకర్, బీజేపీ ఎంపీ రమాదేవిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకుగాను సోమవారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఎదుట హాజరై, అనంతరం సభలో బేషరతుగా క్షమాపణ  చెప్పాలని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ ఆజం ఖాన్‌కు స్పీకర్‌ కార్యాలయం తెలిపినట్లు సమాచారం. క్షమాపణ చెప్పకపోతే ఆజం ఖాన్‌పై చర్యలు తీసుకునేలా స్పీకర్‌కు అధికారమిస్తూ సభలో ఓ తీర్మానం చేసేందుకు అన్ని పార్టీలూ ఒప్పుకున్నాయి.  అన్ని పార్టీల నాయకులతో స్పీకర్‌ ఓం బిర్లా అధ్యక్షతన ఓ సమావేశం నిర్వహించి ఆజం ఖాన్‌ అంశంపై చర్చించారు.

>
మరిన్ని వార్తలు