బీజేపీలో చేరితే చంపుతామంటున్నారు!

11 Aug, 2019 16:10 IST|Sakshi
ఫరీన్‌ దంపతులు

అలీగఢ్‌: బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నందుకు సొంత వర్గీయులు తమను చంపుతామని బెదిరిస్తున్నారని బీజేపీకి చెందిన మైనార్టీ నాయకురాలు తన భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును ఆమోదిస్తూ ఇటీవల పార్లమెంటులో కొత్త చట్టం తీసుకొచ్చిన విషయం​ తెలిసిందే. ఈ చర్యతో ప్రధాని మోదీ పట్ల అభిమానంతో పలువురు ముస్లిం మహిళలు బీజేపీ పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారు. అంతేకాక బీజేపీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముస్లిం మహిళలు చెప్పుకోదగ్గ స్థాయిలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో యూపీలోని ఆలీగఢ్‌లో మైనారిటీ వర్గానికి చెందిన బీజేపీ నాయకురాలు ఫరీన్‌ మోసిన్‌ స్థానికంగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో తనకు బెదిరింపులు వచ్చాయనీ అంతేగాక, తన భర్త మహమ్మద్‌ మోసీన్‌పై అతని ఆఫీసులోనే దాదాపు ఏడెనిమిది మంది దాడి చేసి త్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు అనుకూలంగా వ్యవహరిస్తే నిన్నూ, నీ భార్యను చంపేస్తామని బెదిరించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన ఈ నెల 8న జరిగింది. అదే రోజు త్రిపుల్‌ తలాక్‌ బిల్లును ఆమోదిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. కాగా, ఈ కేసు విషయంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అలీగఢ్‌ ఏఎస్పీ అభిషేక్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు