ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధికి వీరు అనర్హులు! 

8 Feb, 2019 08:15 IST|Sakshi

మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం 

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో ప్రకటించిన ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి(పీఎం–కిసాన్‌) విధి విధానాలను కేంద్రం ప్రకటించింది. ఐదెకరాల్లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులకు రూ.6వేలు సాయంగా అందించేందుకు ఉద్దేశించిన పీఎం–కిసాన్‌ తాజా మార్గదర్శకాల ప్రకారం.. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, పని చేస్తున్న/రిటైరైన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రస్తుత/మాజీ.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మునిసిపల్‌ మేయర్లు, జిల్లా పంచాయతీ అధ్యక్షులు ఈ పథకానికి అర్హులు కారు.

గత ఏడాది ఆదాయ పన్ను చెల్లించిన వారిని కూడా అనర్హులుగా ప్రకటించింది. ఐదెకరాల్లోపు భూమి ఉన్నా కూడా.. కుటుంబంలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వృత్తి నిపుణులు (వైద్యులు, ఇంజినీర్లు, లాయర్లు, చార్టెర్డ్‌ అకౌంటెంట్లు, ఆర్కిటెక్టులు)ఉన్నా అర్హులు కారని తెలిపింది. ఈ పథకం కింద కేంద్రం రూ.75వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 31వ తేదీ లోపు మొదటి విడతగా బ్యాంకు ఖాతాల్లో జమచేయనుంది. రెండో విడతకు మాత్రం ఆధార్‌ కార్డును జత చేయాల్సి ఉంటుంది. 

మరిన్ని వార్తలు