పెళ్లి పేరుతో వైద్యురాలికి రూ. 48 లక్షలు టోకరా

6 Jul, 2015 10:14 IST|Sakshi
పెళ్లి పేరుతో వైద్యురాలికి రూ. 48 లక్షలు టోకరా

న్యూఢిల్లీ: పెళ్లి పేరుతో ఓ మహిళా డాక్టర్ను మోసం చేసి ఆమె నుంచి 48 లక్షల రూపాయలు కాజేశారు. హైదరబాద్కు చెందిన బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

ఆర్నెళ్ల క్రితం అభిషేక్ మోహన్ అనే వ్యక్తి తాను ఇంగ్లండ్లో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నానని, తగిన వధువు కావాలని ఓ వెబ్సైట్లో వివాహ ప్రకటన ఇచ్చాడు. ఈ ప్రకటన చూసి హైదరాబాద్కు చెందిన ఓ మహిళా డాక్టర్ మోహన్తో సంప్రదించింది. భారత్ సంతతికి చెందిన బ్రిటీష్ పౌరుడినని మోహన్ ఆమెతో చెప్పాడు.  ఆ తర్వాత రోజూ ఆన్లైన్లో చాటింగ్ చేసుకునేవారు. కొంతకాలం తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

 

ఇంగ్లండ్ ఫోన్ నెంబర్లతో పాటు భారత్కు చెందిన ఓ సిమ్తో మాట్లాడేవాడని మహిళా డాక్టర్ చెప్పింది. డిస్కౌంట్ ధరతో వైద్య పరికరాలు కొన్నానని, ఉగ్రవాద నిర్మూలన చర్యలకు సహకరించినందుకు ఇరాక్ ప్రభుత్వం బంగారు నగలను బహుమతిగా ఇచ్చిందని మోహన్ చెప్పాడు. వీటి విలువ దాదాపు 5 కోట్ల రూపాయలు వరకు ఉంటుందని తెలిపాడు.  భారత్లో ఉన్న తన బంధువులపై నమ్మకంలేదని, మహిళా డాక్టర్ ఇంటికి పంపుతానని చెప్పాడు.

గత ఏప్రిల్ 7న మహిళా డాక్టర్కు ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. కస్టమ్స్ ఇన్స్పెక్టర్ అని చెప్పుకున్న ఆ వ్యక్తి.. మోహన్ పంపిన వస్తువులు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నాయని, వీటి విలువ కోట్ల రూపాయల్లో ఉన్నందున పన్ను కట్టాలని చెప్పాడు. అభిషేక్ మహిళా డాక్టర్కు ఫోన్ చేసి కస్టమ్స్ ఫీజు కట్టాల్సిందిగా కోరాడు. దీంతో ఆమె 20 లక్షల రూపాయలను ఓ ఎకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసింది.

 

ఆ తర్వాత వేర్వేరు పన్నుల పేరుతో మహిళా డాక్టర్ నుంచి మరో 28 లక్షలు వసూలు చేశారు. ఆమె తన స్నేహితుల దగ్గర కొంత, బ్యాంక్లో లోన్ చేసి ఈ మొత్తం చెల్లించింది. ఆ తర్వాత అభిషేక్కు ఫోన్ చేయగా స్విచాఫ్ అని వచ్చింది. ఎయిర్పోర్టు అధికారులను సంప్రదించగా అలాంటి పార్సిల్ ఏమీ రాలేదని చెప్పారు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 

ఈ కేసును ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్కు బదిలీ చేశారు. ఢిల్లీ పోలీసులు విచారణ జరిపి గుర్గావ్లో ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరిలో ఓ మహిళ కూడా ఉన్నారు. అభిషేక్ మోహన్గా ప్రకటన ఇచ్చిన వ్యక్తి పెళ్లి పేరుతో చాలా మంది అమ్మాయిలతో పరిచయం చేసుకున్నాడని, ఏదో కారణం చెప్పి డబ్బు కావాలంటూ కొందరి ప్రపోజ్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు