కువైట్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర విపక్ష నాయకుడు వై ఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 6వ తేదీన ఈ యాత్ర ఇడుపులపాయ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ప్రజాసంకల్ప యాత్ర దిగ్విజయంగా ముందుకు సాగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ కువైట్ కమిటీ ఆధ్వర్యంలో కువైట్లో సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. ఈ విషయాన్ని కమిటీ కన్వీనర్లు ఇలియాస్ బిహెచ్, ముమ్డి బాలిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు సంక్షేమ పధకాలు పూర్తిగా అందడం లేదని వారు అన్నారు. అంతేకాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాక్షస పాలనను సాగిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు పాలనను అంతమొందించడానికి అన్ని వర్గాల ప్రజలు యాత్రకు స్వచ్ఛందంగా మద్దతూ ఇవ్వాలని రాష్ట్ర ప్రజలను వారు అభ్యర్ధించారు. రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే 2019లో జగన్ను సీఎం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సహ కన్వీనర్లు గోవిందు నాగరాజు, ఎంవీ నరసారెడ్డి అభిప్రాయపడ్డారు.