సర్వశక్తులు ఒడ్డుతున్న అభ్యర్థులు.. హోరాహోరీ ప్రచారం
చివరి అవకాశంగా జోరందుకున్న ప్రలోభాలు
ఏరులై పారుతున్న మద్యం.. చేతులు మారుతున్న కోట్లు
9న సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెర
ఓటరును పోలింగ్ బూత్కు తరలించడంపై మల్లగుల్లాలు
13 వామపక్ష తీవ్రవాద ప్రాంతాల్లో పోలింగ్ వేళలు తగ్గించిన ఈసీ
సాక్షి, హైదరాబాద్: మరో మూడ్రోజుల్లో లోక్సభ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఏప్రిల్ 11న (గురువారం) ఎన్నికలు జరగనున్నందున.. ఎన్నికల నియమావళి ప్రకారం.. మంగళవారం సాయంత్రానికి ప్రచారం ముగియనుంది. దీంతో ఈ చివరి సమయంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు. పోలింగ్కు సమయం సమీపిస్తుండడంతో లాస్ట్మినిట్ ఎన్నికల వ్యూహాలను పదునుపెడుతున్నారు. పగటిపూట హోరాహోరీగా ఎన్నికల ప్రచార సభలు, రోడ్డుషోలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇంకా ప్రచారం నిర్వహించని ప్రాంతా లపై దృష్టి పెట్టి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రధాన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమై పోలింగ్ రోజు నిర్వహించాల్సిన ‘బూత్ మేనేజ్మెంట్’పై ప్రణాళికలు వేసుకుంటున్నారు. మనస్పర్థలు, అసంతృప్తులతో దూరమైన ముఖ్యకార్యకర్తలు, అనుచరులను బుజ్జగించి మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ
పోలింగ్ సమీపించడంతో అభ్యర్థులు చివరి అస్త్రంగా ప్రలోభాలను ముమ్మరం చేశారు. పోటాపోటీగా ఓటర్లను డబ్బులు, మద్యం, కానుకలతో ముంచేస్తున్నారు. లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పోలీసు, ఆదాయ పన్నుశాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో శనివారం నాటికి రూ.41.04 కోట్ల నగదు పట్టుబడగా, అందులో దాదాపు రూ.20 కోట్లు గడిచిన మూడ్రోజుల్లోనే పట్టుబడడం గమనార్హం. ఊరూవాడా మద్యం ఏరులై పారుతోంది. ఇప్పటి వరకు రూ.3.85 కోట్లు విలువ చేసే 2.82 లక్షల లీటర్ల మద్యం పట్టుబడింది. పోలింగ్కు మిగిలిన చివరి నాలుగు రోజుల్లో వందల కోట్ల రూపాయలు ఓటర్లకు పంపిణీ చేసేందుకు పలువురు అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హోరాహోరీగా పోటీ నెలకొన్న సికింద్రాబాద్, ఖమ్మం, భువనగిరి, నల్లగొండ, మల్కాజ్గిరి స్థానాల్లో ఒక్కో ఓటుకు రూ.2 వేలకుపైనే ముట్టజెప్పుతున్నారు. ప్రధానంగా పేద, మధ్యతరగతి ప్రజల ఓట్లను లక్ష్యంగా చేసుకుని వారు నివాసముండే బస్తీలు, కాలనీల్లో పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురిచేస్తున్నారు.
13 అసెంబ్లీ ప్రాంతాల్లో పోలింగ్ సమయం తగ్గింపు!
రాష్ట్రంలోని 5 లోక్సభ స్థానాల పరిధిలోని 13 వామపక్ష తీవ్రవాద ప్రభావిత అసెంబ్లీ ప్రాంతాల్లో పోలింగ్ వేళలను తగ్గిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్.. పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని.. వరంగల్ లోక్సభ స్థానం పరిధిలోని భూపాలపల్లి.. మహబూబాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని ములుగు, పినపాక, ఎల్లెందు, భద్రాచలం.. ఖమ్మం లోక్సభ స్థానం పరిధిలోని కొత్తగూడెం, అశ్వరావుపేట అసెంబ్లీ ప్రాంతాల పరిధిలో ఉదయం 7నుంచి సాయంత్రం 4గంటల వరకు మాత్రమే పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5వరకు పోలింగ్ జరగనుంది.
ప్లీజ్.. వచ్చి ఓటేయండి..
ఓటింగ్ శాతం తగ్గితే గెలుపోటములపై ప్రభావం ఉంటుందని.. ప్రధాన పార్టీల అభ్యర్థులు బెంగపెట్టుకున్నారు. తాజా శాసనసభ ఎన్నికల్లో సగటున 73% పోలింగ్ నమోదు కాగా, హైదరాబాద్ నగర పరిధిలోని నియోజకవర్గాల్లో 49% మందే ఓటుహక్కు వినియోగించుకున్నారు. శివారు ప్రాంతా ల్లోని నియోజకవర్గాల్లో 55% పోలింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఏప్రిల్ 11న పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయాలని అభ్యర్థులందరూ ఓటర్లను వేడుకుంటున్నారు. పోలింగ్ శాతం పెరిగితే మెజారిటీ పెరుగు తుందని అధికార టీఆర్ఎస్, ఫలితాలు తమకే అనుకూలంగా వస్తాయని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గంపెడాశలు పెట్టుకున్నాయి.