పొలిటికల్‌ ఎంట్రీకి అజిత్‌ దోవల్‌  కుమారుడు రెడీ..!

1 Jul, 2018 13:01 IST|Sakshi
శౌర్య దోవల్‌

డెహ్రాడూన్‌ :  జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ కుమారుడు శౌర్య దోవల్‌ పొలిటికల్‌ ఎంట్రీకి రంగం సిద్ధ చేసుకుంటున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పౌరీ ఘర్వాల్‌ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. 43 ఏళ్ల శౌర్య దోవల్‌ ఇండియా ఫౌండేషన్‌ డైరెక్టర్‌గా ఉన్నారనే విషయం తెలిసిందే. 

కాగా గత కొంత కాలంగా శౌర్య ప్రజలతో మమేకమవుతున్నారు. ‘బీమిసాల్‌ ఘర్వాల్‌ అభియాన్’  ద్వారా ఘర్వాల్‌ అభివృద్దికి తోడ్పాటును అందిస్తున్నారు. ఈ స్కీమ్‌లో ప్రజలను భాగస్వాములను చేయుటకోసం రెండు మొబైల్‌ నంబర్లను కూడా బ్యానర్లలో, కటౌట్లల్లో ప్రచురించారు. ఒక మిస్డ్‌ కాల్‌ ఇస్తే అభియాన్‌లో భాగస్వామ్యులు కావాలని తెలియజేస్తారు. మరో నంబర్‌ ద్వారా ‘ మెరుగైన ఘర్వాల్‌ గురించి ఆలోచిస్తున్న వారు ప్రచారంలో పాల్గొనవచ్చు ఇది శౌర్య దోవల్‌ యొక్క చొరవ’  అని పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఘర్వాలి భాషలో కూడా అందుబాటులో ఉంచారు. ఘార్వాలి జిల్లాతోపాటు చుట్టుపక్కల మరో ఏడు జిల్లాల్లో కూడా శౌర్య పోటోలతో బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేశారు. ఇదంతా శౌర్య పొలిటికల్‌ ఎంట్రీ కోసమే అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

గతంలో శౌర్య దోవల్‌ బీజేపీలో చేరతారన్న ఊహాగానాలొచ్చాయి. 2019 ఎన్నికలకు ముందు ఆయన చేరతారని పార్టీ వర్గాలు అన్నాయి.  2017 డిసెంబర్‌లో ఉత్తరాఖండ్‌ రాష్ట్ర బీజేపీ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో కూడా శౌర్య పాల్గొన్నారు. అయితే తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశంలేదని శౌర్య అప్పట్లో అన్నారు

‘ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు. అది నా చేతుల్లో లేదు. కానీ బెమిసాల్ ఘర్వాల్, బులండ్‌ ఉత్తరాఖండ్‌ ప్రాంతాల అభివృద్దికి కృషి చేస్తాను. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రాజకీయ బలం కూడా అవసరం అని అర్థమయింది’  అని శౌర్య ఓ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

కాగా దోవల్‌ పొలిటికల్‌ ఎంట్రీ గురించి బీజేపీ పరోక్షంగా స్పందించింది. ‘ బెమిసాల్‌ ఘర్వాల్‌ ప్రచారం శౌర్య రాజకీయ ఎంట్రీకి ఉపయోగ పడుతుంది. ఈ ప్రచారంలో బీజేపీ పాల్గొనలేదు. అతనికి చాలా తెలివి ఉంది. ఉత్తరాఖండ్‌ సమస్యలపై ఆయనకు పట్టుఉంది. ఇలాంటి తెలివైన వాళ్లు రాజకీయాల్లోకి రావాలి’  అని  ఉత్తరాఖండ్‌ బీజేపీ అధ్యక్షుడు అజయ్‌ భట్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు