ఆంధ్రావాళ్లంతా టీఆర్‌ఎస్‌ వైపే: తలసాని

18 Oct, 2018 05:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని ఆంధ్రావాళ్లంతా టీఆర్‌ఎస్‌ వెంటే ఉన్నారని పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, నిజాలు తెలుసుకునేందుకు కాంగ్రెస్‌ నేతలు కంటి పరీక్షలు చేసుకోవాలని సూచించారు. బుధవారం తెలంగాణభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌ మేనిఫెస్టోను మక్కికి మక్కి కాపీ కొట్టారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు.

గతంలో రూ.రెండు లక్షల రుణమాఫీ అని కాం గ్రెస్‌ చెప్పినా ప్రజలు నమ్మలేదు. ఇప్పుడు రూ.5వేల ఫించన్లు ఇస్తామన్నా నమ్మరు. కాంగ్రెస్‌ దిక్కుమాలిన పార్టీ. ఉత్తమ్‌ పీసీసీ అధ్యక్షుడా... చెప్రాసా? ఏమీ తెలుసుకోకుండా ఇంటింటికీ నీళ్లు రాలేదంటున్నాడు. కాంగ్రెస్‌ నేతల్లా మేం ఉద్యోగాలు అమ్ముకోలేదు. టీఎస్‌పీఎస్సీతో ఉద్యోగాలు ఇచ్చాం. నిజాలు తెలుసుకునేందుకు కాంగ్రెస్‌ నేతలు కంటి పరీక్షలు చేయించుకోవాలి’’అని సూచించారు. పుట్టి పెరిగిన గ్రామాన్ని పట్టించుకోని జైపాల్‌రెడ్డి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఓట్ల కోసమే సెటిలర్లను పొగుడుతున్నామనేది సమంజసం కాదని తలసాని స్పష్టంచేశారు.

మరిన్ని వార్తలు