గాడ్సేపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

11 Mar, 2018 12:54 IST|Sakshi
అసదుద్దీన్‌ ఒవైసీ

గాడ్సే నెం1 టెర్రరిస్ట్‌.. దమ్ముంటే నోటీసులివ్వండి

మా పూర్వీకులు బ్రిటిష్‌వారిపై పోరాటం చేశారు

ఈ దేశంలోనే జీవిస్తాం..ఈ దేశంలోనే చస్తాం

హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ 

పుణె : జాతిపిత మహాత్మా గాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సే ‘నెం1 హిందు రత్న టెర్రరిస్ట్‌’ అని హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై నోటీసులు పంపించే దమ్ము ఎవరికైన ఉందా అని ఆయన ప్రశ్నించారు. 

పుణేలో జరిగిన ఓ కార్యక్రమంలో ఒవైసీ ప్రసంగిస్తూ.. ముస్లింలు భారత దేశాన్ని అమ్మాలనుకోవడం లేదని, కానీ గత 70 ఏళ్ల నుంచి దాడులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింలంతా పాకిస్తాన్‌ లేదా సిరియా వెళ్లాలని కొందరంటున్నారని,  అలా వెళ్లేవారు ఇప్పటికే పాకిస్తాన్‌కు వెళ్లారని ఒవైసీ స్పష్టం చేశారు. మా పూర్వీకులు సైతం బ్రిటిష్‌ వారితో పోరాటం చేశారని, హిందూస్తాన్‌ జిందాబాద్‌ అన్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

‘మేం ఇక్కడే జీవిస్తాం. ఇక్కడే చస్తాం’ అని ఒవైసీ పేర్కొన్నారు. ఇక రాజ్యసభలో ఆగిపోయిన ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై స్పందిస్తూ.. ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు గుప్పించారు.  ‘మిస్టర్‌ మోదీ కళ్లు తెరిచి చూడండి.. మీరు ముస్లిం మహిళల మంచి కోరేవారు కాదు. ముస్లింలకు శత్రువు.’ ఒవైసీ అని విమర్శించారు. ముస్లింలకు వ్యతిరేకంగా చట్టాలు రూపొందిస్తున్నారని ధ్వజమెత్తారు. 

రామ మందిర నిర్మాణం జరగకపోతే భారత్‌ మరో సిరియా అవుతుందని ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్‌ వ్యాఖ్యలపై ఒవైసీ మండిపడిన విషయం తెలిసిందే. రాజ్యంగంపై గౌరవంలేని రవిశంకర్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు