బాబు స్వార్థం కోసం వాడుకుంటున్నారు

4 Feb, 2020 13:14 IST|Sakshi

సాక్షి, గుంటూరు: రాష్ట్రం బీహార్ కంటే వరస్ట్‌గా ఉందనడం మంచి పద్దతి కాదని, దీనిపై రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన జిల్లాలో రూ.కోటితో టెన్నిస్‌ కోర్టు ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. టెన్నిస్‌ కోర్టు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. క్రీడల్లో పతకాలు సాధించిన వారికి నగదు బహుమతులు ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహాన్నందిస్తున్నారు. నగరంలోని బీఆర్ స్టేడియం గత పాలకుల నిర్లక్ష్యానికి గురైందని, దాని మరమ్మత్తుల కోసం తక్షణ సాయం కింద యాబై లక్షలు విడుదల చేస్తామని పేర్కొన్నారు. త్వరలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేత స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. గుంటూరు నగరాన్ని క్రీడల హబ్‌గా తయారు చేస్తామన్నారు.

సింగపూర్‌పై ఉన్న ప్రేమ శ్రీకాకుళంపై లేదు..
కృష్ణ, గుంటూరు అభివృద్ధి చెందిన ప్రాంతాలని, విజయనగరం, శ్రీకాకుళం చాలా వెనుకబడిన ప్రాంతాలని అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. విశాఖలో అతి తక్కువ ఖర్చుతో రాజధాని కట్టొచ్చని అభిప్రాయపడ్డారు. ఇక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబుకు సింగపూర్‌పై ఉన్న శ్రద్ధ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై లేదని విమర్శించారు. కుట్రలు చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో నేషనల్ మీడియా ఆయనను దుమ్మెత్తిపోసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. రాజధాని గ్రామాల్లో అమాయక ప్రజలను రెచ్చగొట్టి బాబు స్వార్థానికి వినియోగించుకుంటున్నారని మండిపడ్డారు. రెండున్నర లక్షల కోట్ల అప్పు చేసి, ఇప్పడు రాష్ట్ర ఖ్యాతి దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. (చదవండి: చేతులెత్తి నమస్కరిస్తున్నా.. విశాఖపై విషం చిమ్మకండి..)

మరిన్ని వార్తలు