సంచలన ఆరోపణలు చేసిన బీసీ సంఘం అధ్యక్షుడు

8 Apr, 2019 16:03 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : కొవ్వూరులో బీసీ వర్గానికి చెందిన గోపాల కృష్ణ అనే వ్యక్తి హత్య తెలుగుదేశం నాయకుల కనుసన్నల్లోనే జరిగిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గూడూరి వెంకటేశ్వర రావు ఆరోపించారు. సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గోపాల కృష్ణ హత్య కేసును న్యాయ విచారణ జరిపించి దోషులను శిక్షిస్తానని టీడీపీ నాయకుడు ముళ్లపూడి బాపిరాజు హామీ ఇచ్చారన్నారు. కానీ ఆ తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. ఈ హత్య టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే జరిగిందని అందరికి తెలుసన్నారు. అందుకే మంత్రి జవహర్‌, బాపిరాజులు జనాల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారని పేర్కొన్నారు.

అంతేకాక ఏలూరులో ఇందుమతి అనే రజక స్త్రీ స్నానానికి వెళ్తే నిప్పు పెట్టి హత్య చేశారని వెంకటేశ్వర రావు ఆరోపించారు. ఈ దారుణాన్ని జిల్లా ఎస్పీ ఆత్మహత్యగా చిత్రీకరించారని మండిపడ్డారు. ఇలాంటి టీడీపీ నాయకులకు బీసీలను ఓట్లు అడిగే హక్కు లేదని స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెంలో 400 మంది బీసీలు లోన్లకు దరఖాస్తు చేస్తే కేవలం ముగ్గిరికి మాత్రమే లోన్‌ ఇచ్చారని తెలిపారు. జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు