ఎందుకొచ్చారు!

21 Feb, 2019 13:37 IST|Sakshi
సమస్యలపై ప్రజలు నిలదీయడంతో సమాధానం చెప్పకుండా వెళ్తున్న ఎంపీ బుట్టా రేణుక

ఐదేళ్లుగా మా ఊరికి ఏం చేశారు ?

ఎంపీ బుట్టారేణుకను నిలదీసిన సి. బెళగల్‌ గ్రామస్తులు  

కర్నూలు, సి.బెళగల్‌: ‘మా ఊరిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఐదేళ్లుగా మీ వెంట తిరుగుతున్నా పట్టించుకోలేదు.  సమస్యలు తీర్చనప్పుడు మా ఊరికి ఎందుకొచ్చారం’టూ కర్నూలు ఎంపీ బుట్టా రేణుకను  సి.బెళగల్‌ ఎస్సీ కాలనీ వాసులు నిలదీశారు.  ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన మంచినీటి పైపులైను పనులను ప్రారంభించేందుకు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డితో కలిసి బుధవారం ఆమె ఎస్సీ కాలనీకి వచ్చారు. ఈ సందర్భంగా   కాలనీ పెద్దలు దేవదానం, నాగేష్, మిరపకాయల మారెప్ప తదితరులు కాలనీ సమస్యలపై ఎంపీని ప్రశ్నించారు. ఇంటింటికీ కుళాయి అని చెప్పి.. టీడీపీ కార్యకర్తల ఇళ్లకే  ఇస్తున్నారు.

కాలనీలో వీధిరోడ్లు బాగుచేయాలని, ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు మంజూరు చేయాలని  కాళ్లు అరిగేలా మీ వెంట తిరిగితే మీరేం చేశారని  ఎంపీని నిలదీశారు.   అభివృద్ధి పేరుతో మీరు వైఎస్‌ఆర్‌సీపీని వీడారని.. మరి మీరు ఇప్పటి వరకు చేసిన  అభివృద్ధి ఏమిటో చెప్పాలని ఎంపీని సూటిగా  ప్రశ్నించారు.  మీ అనుచరులకు, పార్టీ కార్యకర్తలకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందిస్తే సరిపోదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పరిధిలోని నిధులను తాగునీటికి కేటాయించానని,  ఏవైనా సమస్యలుంటే ఎమ్మెల్యేతో చేయించుకోవాలంటూ స్థానిక ప్రజల ఆవేదనను పట్టించుకోకుండా ఎంపీ అక్కడి నుంచి వెళ్లిపోయారు.  ఆగ్రహించిన ఎస్సీ కాలనీవాసులు తమ సమస్యలు తీర్చకుంటే   కాలనీకి రావద్దంటూ నినాదాలు చేశారు. 

దూరంగా ఎంపీపీ: ఎంపీ బుట్టారేణుక పర్యటనకు   ఎంపీపీ నాగమనెమ్మ, స్థానిక ఎంపీటీసీ సభ్యులు, మండల అధికారులు, కార్యకర్తలు, అభిమానులు దూరంగా ఉన్నారు. పట్టుమని పదిమంది కూడా ఎంపీ  వెంట కనిపించలేదు. 

మరిన్ని వార్తలు