టీఆర్‌ఎస్‌పై పోరాటం కాంగ్రెస్‌తో అసాధ్యం

29 May, 2019 07:30 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న లక్ష్మణ్‌. చిత్రంలో పొంగులేటి సుధాకర్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌పై పోరాటం కాంగ్రెస్‌తో సాధ్యం కాదని, ఆ పార్టీకి ఆ స్థాయికూడా లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా కాంగ్రెస్‌ మూడు స్థానాలు మాత్రమే గెలిస్తే టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ మాత్రం ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ తరఫున గెలిచిన వారంతా ఆ పార్టీలో ఎంతకాలం ఉంటారో చూసుకోవాలన్నా రు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోయిం దని యూపీలో స్వయంగా రాహుల్‌ ఓడిపోయారని, ఆరు రాష్ట్రాల్లో ఒక్క ఎంపీ సీటును మాత్రమే గెలిచిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతిపక్షస్థానా న్ని కట్టబెడితే సొంత వ్యాపారాల కోసం అధికార పార్టీలో చేరుతున్నారని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి జరిగిందని, ఉత్తమ్‌ జైలుకు వెళ్తారని టీఆర్‌ఎస్‌ నాయకులు అన్నారని అయితే లోపాయికా రీ ఒప్పందంతో ఆ విషయాన్ని పక్కన పడేశారని చెప్పారు. ఉత్తమ్, కేసీఆర్‌తో మ్యాచ్‌ఫిక్సింగ్‌తో గెలిచారని కాంగ్రెస్‌ నాయకులే అంటున్నారన్నారు. ఉత్తర తెలంగాణ నుంచి విజయదుందుభి మోగించిందన్నారు. బీజేపీ ఎంపీలు సీఎం కుడిభుజమైన ఆయన కూతురు కవితను ఓడించారన్నారు. మెజారిటీ ఇచ్చిన ప్రజల ఓట్లను టీఆర్‌ఎస్‌ అపహాస్యం చేస్తున్నారని, వారి ఇల్లుగుల్లవుతోందన్న విషయాన్ని కేటీఆర్‌ తెలుసుకోవాలన్నారు. ఓటమితో టీఆర్‌ఎస్‌ నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు.

భవిష్యత్‌ బీజేపీదే
బీజేపీ విజయాన్ని చిన్నదిగా చేసి చూపించే ప్రయత్నంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు ఉన్నాయని లక్ష్మణ్‌ ఆరోపించారు. కేటీఆర్‌ ఇప్పుడు మోదీ హవా అంటున్నారని, ఎన్నికల ఫలితాలకు ముందు మోదీ హవా లేదని ఎలా అన్నారని ప్రశ్నించారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో 37% ఓట్లతో బీజేపీ అగ్రస్థానంలో ఉందన్నారు. కేసీఆర్‌ కుటుంబ పోకడతో టీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ ఫ్లోర్‌ లీడర్‌ బీజేపీలో చేరారన్నారు. అమిత్‌ షా టార్గెట్‌ తెలంగాణ అని, తెలంగాణలో భవిష్యత్‌ బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. ఇంటర్‌ విద్యార్థుల కుటుంబాలను రోడ్డు మీద వేశారని, ఇంటర్‌ తప్పిదాల విషయంలో ఇంటర్‌ కార్యదర్శి అశోక్‌ను, విద్యాశాఖ మంత్రిని తప్పించాల్సిందేనని డిమాండ్‌ చేశారు. బీజేపీ నాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ బురద జల్లితే కమలం ఇంకా వికసిస్తుందన్నారు. రాష్ట్రంలో 4 స్థానాల్లో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు