ఫ్యామిలీ కోటాలో రాబర్ట్‌ వాద్రాకు భారత రత్న!

7 Mar, 2019 14:19 IST|Sakshi
రాహుల్‌ గాంధీతో రాబర్ట్‌ వాద్రా (ఫైల్‌ ఫొటో)

ట్విటర్‌లో బీజేపీ ఎద్దేవా

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్‌ వాద్రా లక్ష్యంగా బీజేపీ పదునైన వ్యంగ్యాస్త్రాలు సంధించింది. దేశాన్ని దోచుకున్నానని అంగీకరించినందుకు ఆయన భారత రత్న పురస్కారానికి అర్హులని చురకలు అంటించింది. దేశాన్ని లూటీ చేసిన వ్యక్తులు దేశం నుంచి పారిపోయారని, కానీ, తాను ఇంకా దేశంలోనే ఉన్నానని రాబర్ట్‌ వాద్రా వ్యాఖ్యలపై బీజేపీ ఈ మేరకు ట్విటర్‌లో విమర్శలు చేసింది.

‘రాబర్ట్‌ వాద్రా నిజాయితీపరుడు. లూటీ చేశానని అంగీకరించినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఫ్యామిలీ కోటా ప్రకారం ఆయన ఇప్పుడు భారత రత్న పురస్కారానికి అర్హులు’ అని బీజేపీ తన అధికారిక ట్విటర్‌ పేజీలో ఎద్దేవా చేసింది. 

బుధవారం మీడియాతో మాట్లాడిన వాద్రా.. తాను దేశంలోనే ఉంటానని, అవినీతి ఆరోపణల నుంచి బయటపడేవరకు రాజకీయాల్లోకి రానని చెప్పారు. ‘నేను దేశంలోనే ఉన్నాను. దేశాన్ని లూటీ చేసి దేశం నుంచి పారిపోయిన వ్యక్తులు ఉన్నారు. వారి గురించి ఏమంటారు? నేను ఎప్పుడూ దేశంలోనే ఉంటాను. నాపై ఉన్న అభియోగాలు తొలగిపోయేవరకు నేను దేశాన్ని వీడను. రాజకీయాల్లోకి రాను. అది నా హామీ’ అని వాద్రా అన్నారు.

మరిన్ని వార్తలు