బీజేపీకి షాకిచ్చిన శత్రుఘ్నసిన్హా..!

28 Mar, 2019 11:17 IST|Sakshi

న్యూఢిల్లీ : బీజేపీ రెబల్‌ శత్రుఘ్నసిన్హా ఎన్నికల వేళ ఆ పార్టీకి షాకివ్వనున్నారు. గురువారం ఉదయం 11.30 గంటలకు ఆయన కాంగ్రెస్‌లో చేరుతారని ఎంపీ అఖిలేష్‌ ప్రసాద్‌ తెలిపారు. బిహార్‌లోని పట్నాసాహిబ్‌ లోకసభ స్థానం నుంచి వరుసగా రెండు సార్లు గెలుపొందిన శత్రుఘ్నకు బీజేపీ ఈ సారి టికెట్‌ నిరాకరించింది. ఆ సీటును కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు కేటాయించింది. కాగా, పట్నాసాహిబ్‌ నుంచే  శత్రుఘ్నను కాంగ్రెస్‌ పోటీలోకి దింపుతుందని తెలుస్తోంది. గతకొంత కాలంగా బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్న శత్రుఘ్న.. కాంగ్రెస్‌, రాహుల్‌ గాంధీని పొగడ్తలతో ముంచెత్తున్నారు.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే దేశంలోని అత్యంత పేద కుటుంబాలకు ఏటా రూ 72,000 అందిస్తామని రాహుల్‌ ప్రకటించిన కనీస ఆదాయ హామీ పధకంపై ఆయన ప్రశంసలు కురిపించారు. పరిస్థితులకు అనుగుణంగా రాహుల్‌ ప్రకటించిన ఈ పధకాన్ని పేదరికంపై మాస్టర్‌స్ర్టోక్‌గా ఆయన అభివర్ణించారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ సహా, పాలక బీజేపీ విధానాలను గత కొన్నేళ్లుగా శత్రుఘ్న బాహాటంగా ఎండగడుతున్న సంగతి తెలిసిందే. తనకు టికెట్‌ నిరాకరించిన బీజేపీ నాయకత్వానికి తానూ అదేస్ధాయిలో బదులిస్తానని సిన్హా ఇదివరకే స్పష్టం చేశారు. అద్వానీకి గాంధీనగర్‌ నుంచి తిరిగి పోటీ చేసే అవకాశం కల్పించకపోవడం పట్లా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దిగ్గజ నేతను రాజకీయాల నుంచి వైదొలిగేలా పార్టీ అగ్రనాయకత్వం వ్యవహరిస్తోందని మం‍డిపడ్డారు.

(చదవండి : షాట్‌గన్‌ వర్సెస్‌ రవిశంకర్‌ ప్రసాద్‌?)

మరిన్ని వార్తలు